Bandi Sanjay Padayatra : మళ్లీ పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్, ఈ నెల 7 నుంచి షురూ!
04 November 2023, 21:09 IST
- Bandi Sanjay Padayatra : తెలంగాణ ఎన్నికల వేల బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 7 నుంచి కరీంనగర్ పరిధిలో పాదయాత్ర చేయనున్నారు.
బండి సంజయ్
Bandi Sanjay Padayatra : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేడ్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ పార్టీ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుండటంతో బండి సంజయ్ కి బీజేపీ పార్టీ ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కోరింది. మిగిలిన సమయాన్ని తాను పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించాలని సూచించింది. అందులో భాగంగా 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ ను రూపొందించింది. తొలిరోజు సిరిసిల్ల, నారాయణపేట, మరుసటి రోజు ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి సంజయ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుకు అనుమతిచ్చింది.
మరోవైపు బండి సంజయ్ కుమార్ ఈనెల 6న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం ఉండటంతో వేద పండితుల సూచనల మేరకు ఆరోజు నామినేషన్ వేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నారు.
రిపోర్టింగ్ : గోపీకృష్ణ, కరీంనగర్