Kakatitya University: వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ
09 January 2024, 10:10 IST
- Kakatitya University: రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరున్న కాకతీయ యూనివర్సిటీ వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది.
కాకతీయ యూనివర్శిటీ
Kakatitya University: కాకతీయ వర్శిటీలో వీసీ నియామకం నుంచి వివాదాలు వెంటాడుతుండగా.. తాజాగా కాంట్రాక్టర్ కు బిల్లులు ఇచ్చేందుకు ఆడిట్ సెక్షన్ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది.
ఆ తరువాత కూడా అదే పరిస్థితులు కొనసాగుతుండటం కూడా కలవరానికి గురి చేస్తోంది. దీంతోనే కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇక్కడి విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వరుస ఘటనలతో కలకలం
యూనివర్సిటీ హాస్టళ్లకు పాలు, పెరుగు సప్లై చేసే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించే విషయంలో ఇక్కడి అధికారులు చేతివాటం చూపారు. పెండెం రాజేందర్ అనే కాంట్రాక్టర్ వర్సిటీలోని నాలుగు హాస్టళ్లకు గతేడాది వరకు పాలు, పెరుగు సరఫరా చేయగా.. ఆయనకు దాదాపు 19 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.
ఆ బిల్లులు చెల్లించడానికి ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య లంచం డిమాండ్ చేశారు. రూ.50 వేలు ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తానని చెప్పడంతో చివరకు సదరు కాంట్రాక్టర్ కిష్టయ్యను ఏసీబీకి పట్టించారు.
చదువులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటపడటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన మరునాడే మరో వివాదం కేయూ ఆఫీసర్లను చుట్టుముట్టింది. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం క్యాంపస్ లో వివిధ పనులు చేయగా.. దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలోనూ ఆఫీసర్లు కమీషన్లకు ఆశపడ్డారు.
ఈ మేరకు కమీషన్లు అందేదాకా బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో ఆ కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యక్తి మనోవేదనకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం వీసీ బిల్డింగ్ కు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాగా కేయూ అధికారులు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్ చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు వత్తాసు!
సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కాకతీయ యూనివర్సిటీ అధికారులు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఘటనల్లో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆఫీసర్ల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. కమీషన్లు ఇస్తున్న కాంట్రాక్టర్లు క్వాలిటీ లేని ఫుడ్, పాలు, పెరుగు సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వర్సిటీలో 2023–24 విద్యాసంవత్సరానికి కిరాణా సామగ్రి, గుడ్లు, అరటి పండ్లు, పాలు, పెరుగు తదితర సరకులు సరఫరా చేసేందుకు 2023 ఆగస్టులో టెండర్లు నిర్వహించగా.. గతంలో సరఫరా చేసిన రాజేందర్ కు కాకుండా ఈసారి వేరే వ్యక్తికి టెండర్ ఇచ్చారు.
వర్సిటీ అధికారుల నిబంధనల ప్రకారం నాణ్యమైన విజయ డెయిరీ లేదా ముల్కనూరు డెయిరీకి సంబంధించిన పాలు, పెరుగు మాత్రమే సరఫరా చేయాలి. కానీ ఆ రెండూ కాకుండా తక్కువ రేటు కలిగిన క్వాలిటీ లేని పాలు, పెరుగు సరఫరా చేస్తున్నారని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు చెందిన పాలు, పెరుగు సప్లై చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులకు క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటున్న అధికారులు అన్నీ తెలిసీ సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాణ్యతలేని సరుకులు పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీసీ తీరుపై తీవ్ర విమర్ళలు
కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ నియామకం అయినప్పటి నుంచి ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021 మే నెలలో ఆయన వీసీగా బాధ్యతలు తీసుకోగా ఆయనకు ప్రొఫెసర్ గా పదేండ్ల అనుభవం లేకున్నా వైస్ ఛాన్సలర్ పదవి అప్పగించడం వివాదానికి దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా తాటికొండ రమేశ్ ను వీసీగా నియమించారంటూ కొందరు కోర్టుకు వెళ్లగా.. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి.
దీంతో పాటు వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాస రావు ప్రొఫెసర్ల ప్రమోషన్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా ఇద్దరూ సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు తీసుకోవడంతో పాటు మరికొందరి విషయంలోనూ రూల్స్ బ్రేక్ చేశారనే వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.
పీహెచ్డి సీట్ల కేటాయింపులో అక్రమాలు
కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగిన వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. కొంతమంది అనర్హులకు పీహెచ్ డీ సీట్లు కట్టబెట్టారని విద్యార్థి సంఘాల నేతలు గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దాదాపు 40 రోజుల పాటు నిరసన దీక్ష కొనసాగించారు.
దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్, అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇలా ఒకదాని తరువాత మరో వివాదం వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం ఫోకస్ పెట్టాలని వేడుకోలు
గత సెప్టెంబర్ లో విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సందర్శించి, ఇక్కడి వీసీ, రిజిస్ట్రార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వీసీ రమేశ్ బీఆర్ఎస్ కు బంట్రోత్ గా పని చేస్తున్నాడని, వీసీ, రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇప్పుడు వరుస వివాదాలు వర్సిటీని చుట్టుముడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీపై ఫోకస్ పెట్టాలని ఇక్కడి విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడి పరిస్థితిని కూడా వివరించినట్లు తెలిసింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ అధికారుల తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.