NarayanaKhed Politics: నారాయణఖేడ్ లో పట్లోళ్ల, షెట్కార్ కలిసిపోయినట్టేనా!
20 September 2023, 8:21 IST
- NarayanaKhed Politics: నారాయణఖేడ్ నియజోకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ షెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డిల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయి, ఇద్దరు కలిసిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
నారాయణఖేడ్లో గ్రూపు గొడవలు సమసిపోయినట్టేనా?
NarayanaKhed Politics: నారాయణఖేడ్ నియజోకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ షెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డి ఒక్కటవుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఆ పార్టీ కార్యకర్తల నుండి... పార్టీలో రెండు బలమైన వర్గాలు చివరి రెండు ఎన్నికల్లో కయ్యానికి కాలు దువ్వటంతో ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది.
కాంగ్రెస్లో వైరి వర్గాలు కలిసి పని చేస్తే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కి గట్టి పోటీనివ్వడం ఖాయమని వారు భావిస్తున్నారు. సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డి మద్యల కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, సంజీవ రెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు.
షెట్కార్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీచేస్తారు. సంజీవ రెడ్డి తన అసెంబ్లీ ఎన్నికల ఖర్చునంతా భరించడంతో పాటు, ఎంపీ ఎన్నికల్లో షెట్కార్ ఖర్చును కూడా తానే భరించాలని ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది.
కలిసివుంటే గెలుపు కాంగ్రెస్ దే!
నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి కాంగ్రెస్ పార్టీ నిర్విహించిన సర్వే లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి భూపాల్ రెడ్డి వైపు 43 శాతం ప్రజలు మొగ్గు చూపక, కాంగ్రెస్ పార్టీ లీడర్లు సంజీవ రెడ్డి వైపు 37 శాతం, షెట్కార్ వైపు 10 శాతం మంది ప్రజలు మొగ్గు చూపారు. బీజేపీతో పాటు, నారాయణఖేడ్ నుండి బరిలో ఉండాలన్న మిగతా నాయకులూ కలిపి మిగిలిన 10 శాతం పంచుకున్నారు.
ఈ సర్వే లో కాంగ్రెస్ నాయకులైన సంజీవ రెడ్డి, షెట్కార్ కలిసిపోతే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిసే అవకాశం ఉందని ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సంజీవ రెడ్డి, షెట్కార్ కలిసిపోయే విదంగా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ కూడా చర్చలు జరుపుతోంది. సంజీవ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయాలని ఆశిస్తుండటంతో, షెట్కర్ వర్గీయులతో అన్ని విధాలుగా కలిసిపోవడానికి చర్చలు జరుపుతున్నాడు.
వైరంతోనే వరుస పరాజయాలు…
2014 ఎన్నికల్లో సంజీవ రెడ్డి తండ్రి పట్లోళ్ల కిష్ట రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 14, 000 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిపై గెలుపొందాడు. కానీ రెండు సంవత్సరాలు నిండకముందా అనారోగ్యంతో కిష్ట రెడ్డి చనిపోవడంతో 2016 లో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉపఎన్నికలో, కాంగ్రెస్ కిష్టా రెడ్డి తనయుడు సంజీవ రెడ్డి ని బరిలోకి దించింది.
సంజీవ రెడ్డికి రాజకీయంగా అనుభవం పెద్దగా లేకపోవటం, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో, బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి పైన 53,000 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందాడు. షెట్కార్ వర్గం కూడా సంజీవ రెడ్డి కి ఈ ఎన్నికల్లో పూర్తిగా సహకరించలేదు అనే ఆరోపణ ఉన్నది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ షెట్కార్ కి ఇవ్వటంతో, సంజీవ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశాడు. ఇద్దరు నాయకులూ విడిపోవడంతో, భూపాల్ రెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. ఈ సారి భూపాల్ రెడ్డి 58,000 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. ఓటమి తర్వాత, సంజీవ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. నారాయణఖేడ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నందున, ఈ సారి షెట్కార్, సంజీవ రెడ్డి కలిసిపోయి, సంజీవ రెడ్డిని అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండ ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది అని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.