TS Weather : ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు! ఈ జిల్లాలకు ‘రెడ్’ అలర్ట్
21 July 2023, 9:20 IST
- Rains in Telangana: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలకు కూడా సెలవులను పొడిగించింది సర్కార్. మరో 5 రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది.
తెలంగాణకు భారీ వర్ష సూచన
Weather Updates: తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఏ మాత్రం ఆగకుండా వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే జనం బయటికి రాకుండా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కీలక అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రెడ్ అలర్ట్…
ఇవాళ, రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం…
హైదరాబాద్లో గురువారం భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్లో సగటున 18.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గురువారం సగటున 10 సెం.మీ. వర్షం కురిసినట్లు అంచనా. డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్యధికంగా మల్కాజిగిరిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉగ్ర గోదావరి…
గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులు దాటింది. మొ దటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఏస్తారు. భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం (ఫోన్ నెంబర్ 08743- 232444), కొత్తగూడెం కలెక్టరేట్లో కం ట్రోల్ రూమ్స్ (ఫోన్ నంబర్- 08744-241950)ను ఏర్పాటు చేశారు. మరోవైపు పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.