Bhadradri Ganja: భద్రాద్రి జిల్లాలో గుప్పుమంటున్న గుడుంబా.. యథేచ్ఛగా గంజాయి, చాక్లెట్ల విక్రయాలు…
16 February 2024, 12:59 IST
- Bhadradri Ganja: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి గుప్పు మంటోంది. పోలీసులు నిత్యం దాడులు నిర్వహిస్తున్నప్పటికీ దొడ్డి దారిన తరలిపోతూనే ఉంది. తచె
భద్రాద్రి జిల్లాలో బయట పడిన గంజాయి చాక్లెట్లు
Bhadradri Ganja: భద్రాద్రి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి కావడం గమనార్హం. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా గంజాయి దారులే కనిపిస్తున్నాయి.
ప్రధానంగా జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో పాటు నాలుగు రాష్ట్రాల మీదుగా రవాణా రాకపోకలు సాగుతుంటాయి. దీంతో నిషేధిత గంజాయి రవాణాకు హద్దూ అదుపు లేకుండా పోయింది.
నిత్యం జిల్లాలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ రవాణా చేసే వారు పట్టుపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వేలాది క్వింటాళ్ల గంజాయి సరిహద్దులను దాటుకుంటూ వెళ్లిపోతోంది.
దొరికితే దొంగ లేకుంటే దొరే అన్నట్లు ఇక్కడ తంతు సాగుతోంది. ఐదంచెల వ్యవస్థగా ఈ గంజాయి వ్యాపారం సాగుతోంది. దళారులను ఏర్పాటు చేసుకుని గంజాయి రవాణా సాగిస్తుంటారు.
పొరుగు రాష్ట్రమైన ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల నుంచి ప్రధానంగా రవాణా సాగుతోంది. భద్రాచలం ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దున ఉండటం స్మగ్లర్లకు కలిసొచ్చే అంశంగా మారింది. రాత్రి వేళల్లో భద్రాచలంలోకి ప్రవేశించి గుట్టుచప్పుడు కాకుండా దాటిస్తున్నట్లు తెలుస్తోంది.
రైలు రవాణా ఉన్న ప్రాంతాలకు తరలించి సులువుగా సరిహద్దులు దాటిస్తున్నట్లు గతంలో పలు సందర్భాల్లో వెల్లడైంది. అశ్వాపురం మండల పరిధిలో ఇదే తరహా వ్యవహారం బయటపడింది.
చాక్లెట్లు, సిగరేట్లు..
గతంలో గంజాయి రెండేసి కేజీలు, ఐదేసి కేజీల ప్యాకెట్లు రూపంలో లభ్యమయ్యేది. దీన్ని తరలించేందుకు ఇబ్బందిగా అనిపిస్తే చిన్న చిన్న బొమ్మల్లో పెట్టి సులువుగా తరలించేవారు.
ఇప్పుడు చాక్లెట్లు, సిగరేట్ల రూపంలో కూడా అందుబాటులోనికి వచ్చాయి. నెల కిందట భద్రాచలం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళల వద్ద గంజాయి చాక్లెట్లను ఖమ్మంలో పట్టుకున్న ఉదంతం తెలిసిందే.
గంజాయి మత్తకు అలవాటు పడ్డ కొందరు ఇతరులకు కూడా ఈ అలవాటును అంటిస్తున్నారు. దీంతో గంజాయి వాడకం మరింతంగా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. శివారు ప్రాంతాల్లో యువకులు పెద్ద ఎత్తున గంజాయి మత్తుకు బానిసలై జీవితాలు పాడు చేసుకుంటున్నారు.
గంజాయి పొగ విద్యార్థులను సైతం తాకింది. తాజాగా అన్నపురెడ్డి పల్లి మండల కేంద్రంలోని గురుకులంలో యువుకులు గంజాయికి బానిసలై తోటి విద్యార్థులపై విచ్చలవిడిగా దాడులు చేసిన వ్యవహారం కలకలం రేపింది. వారికి హాస్టల్లో పని చేసే వారే సప్లై చేస్తున్నట్లు తేలింది.
ఛత్తీస్ గఢ్, ఒడిస్సాకు చెందిన పలువురు కూలీలు ఆయా ప్రాంతాల్లో పని చేస్తుండటంతో వారి వద్ద నుంచి గంజాయిని సేకరిస్తున్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో విద్యార్ధులు కొందరు గంజాయిని అమ్ముతూ అరెస్టయిన సందర్భాలున్నాయి.
ఆగని అక్రమ రవాణా...
భద్రాద్రి జిల్లాలో ఏదో ఒక రూపంలో నిత్యం గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. వందలాది మంది ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. స్థానికంగా అమ్మకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు దానిని తరలించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు.
ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో లభ్యమయ్యే గంజాయి మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు, ఓడరేవులున్న ప్రదేశాలకు చేరుకుని అక్కడ్నుంచి ఇతర దేశాలకు సరఫరా అవుతున్నట్లు పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. గంజాయి అక్రమ రవాణా దారులను పట్టుకుంటున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అసలు మూలలపై పట్టు సాధించ లేకపోతున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్ గఢ్, ఒడిస్సాల్లో గంజాయి పంట సాగు చేస్తుంటారు. ఆ రాష్ట్ర అధికారులకు అది తెలిసినప్పటికీ అటవీ గ్రామాల్లోనికి వెళ్లేందుకు సాహసం చేయరు. గంజాయి దారులు నిలిచిపోవాలంటే ప్రధానంగా మూలలపై దెబ్బకొడితేనే తప్ప నిషేధిత గంజాయి రవాణా అగదని పోలీస్ శాఖలోని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)