NTR Commemorative Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం కొనుగోలు చేయండి ఇలా…
28 August 2023, 13:48 IST
- NTR Commemorative Coin: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా స్మారక నాణాన్ని హైదరాబాద్ మింట్లో ముద్రించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో దానిని విడుదల చేశారు. మంగళవారం నుంచి ఈ నాణాన్ని విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.
రేపటి నుంచి ఎన్టీఆర్ స్మారక నాణాల విక్రయాలు
NTR Commemorative Coin: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ముద్రించిన నాణాలను 29వ తేదీ నుంచి విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ మింట్ కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్న మింట్ కాంపౌండ్లో నేరుగా నాణాలను విక్రయించనున్నట్లు చీఫ్ జనరల్ మేనేజర్ విఎన్ఆర్ నాయుడు తెలిపారు. తొలి విడతలో 12వేల నాణాలను అందుబాటులో ఉంచనున్నారు.
తెలుగు సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ముద్రించిన స్మారక నాణాలను మంగళవారం నుంచి మింట్లో విక్రయించనున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్మారక నాణాన్ని ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
సినీ నటుడిగా, రాజకీయ నాయకుడి, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ గౌరవార్ధం ముద్రించిన నాణాలను అభిమానులు సొంతం చేసుకునేందుకు వీలుగా మింట్లో విక్రయాలు జరుపనున్నారు. దేశంలో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన ప్రముఖుల చిత్రాలతో నాణాలను ముద్రించే అనవాయితీని మింట్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ స్మారకార్థం రూపొందించిన నాణాలను ఆగష్టు 29 నుంచి విక్రయించనున్నారు. ఆన్లైన్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చుద్వారా నాణాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఈ లింక్ ద్వారా నాణాలను కొనుగోలు చేయవచ్చు. https://www.indiagovtmint.in/en/commemorative-coins/
నాణాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేయాలని భావించిన వారు సైఫాబాద్లోని మింట్ సేల్ కౌంటర్ నుంచి కూడా నేరుగా ఎన్టీఆర్ స్మారక నాణాలను కొనుగోలు చేయవచ్చు. ఎన్టీఆర్ చిత్రంతో కూడిన నాణెం ఖరీదు రూ.3400 నుంచి రూ.4వేల పై చిలుకు ఖరీదు చేసే అవకాశం ఉంది. గతంలో ముద్రించిన రూ.100 స్మారక నాణాల ధరలకు అనుగుణంగా ఎన్టీఆర్ నాణెం కూడా దాదాపు ఇదే ఖరీదులో ఉండే అవకాశం ఉంది.
చర్లపల్లిలో ఉన్న ఐజీమింట్ సేల్స్ కౌంటర్లో కూడా నేరుగా ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న 100రుపాయల నాణాలను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాలకు మింట్ ఫైనాన్స్ విభాగం మేనేజర్ డి.సాంబశివరావు 9885299033లో సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి నాణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా డిమాండ్కు అనుగుణంగా నాణాల కేటాయింపు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి పరిమిత సంఖ్యలోనే నాణాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు. నాణం ఖరీదు చెల్లించిన వారికి అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.