Railway Projects : తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదు- కిషన్ రెడ్డి
03 September 2023, 20:15 IST
- Railway Projects : తెలంగాణలో పలు కీలక రైల్వే ప్రాజెక్టులను రైల్వే శాఖ ప్రకటించింది. ఈ వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రాజెక్టులకు తెంలగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ఆయన ఆరోపించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Railway Projects : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి కొత్త రైల్వే ప్రాజెక్టుల వివరాలను ఆదివారం వెల్లడించారు.
- ఆదిలాబాద్ నుంచి పటాన్చెరువు వరకు కొత్త రైలు మార్గం
- వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్
- వరంగల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్
- ఉందానగర్ నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైన్
- ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్
తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు
తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్షలను రైల్వే శాఖ తీర్చనుంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్చెరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుచేస్తుంది. ఈ ప్రాజెక్టులో నార్త్ తెలంగాణను హైదరాబాద్, ముంబయి, నాగ్పూర్ మీదుగా దిల్లీ మార్గంతో అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ ఆర్థికాభివృద్ధితో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు రైతులకు వీలవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 317 కి.మీ కాగా, అంచనా వ్యయం సుమారు రూ. 5,706 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కాటన్, గ్రానైట్ ఎగుమతులకు
మరో ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లా, డోర్నకల్ నుంచి కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్ వరకు రైల్వే మార్గం ఏర్పాటుచేస్తారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కొత్త రైల్వే లైన్ ద్వారా అనుసంధానిస్తారు. ఈ ప్రాంతాల నుంచి కాటన్ ఎగుమతి, బియ్యం రవాణా, గ్రానైట్ తరలింపునకు నూతన రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను అనుసంధానించడంతో వాణిజ్య అవసరాలకు ఈ మార్గం ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 296 కి.మీ కాగా, అంచనా వ్యయం సుమారు రూ.5,330 కోట్లు అని కిషన్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, అమరావతి మధ్య
మరో కీలకమైన ప్రాజెక్టు కాచిగూడ (ఉందానగర్) నుంచి జగ్గయ్యపేట రంగారెడ్డి జిల్లా మీదుగా చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటుచేస్తు్న్నారు. విజయవాడకు వెళ్లే జాతీయ రహదారికి సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ అమరావతిలను కలిపేందుకు అతి తక్కువ దూరం రైల్వే మార్గం ఇది కాబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజారవాణా, వాణిజ్య అవసరాలు, సిమెంట్ ప్లాంట్లకు నూతన కొత్త లైన్ ద్వారా లబ్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పొడవు 228 కి.మీ కాగా, అంచనా వ్యయం సుమారు రూ.4,104 కోట్లు అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు
కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రాజెక్టుల భూసేకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్కు భూమి కేటాయించాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్డుకు కూడా రాష్ట్రం స్పందించలేదన్నారు. వచ్చే ఏడాది చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తామన్నారు. యాదాద్రి ఎంఎంటీస్తో సహా పలు రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఆరోపించారు.