JP Nadda : బీఆర్ఎస్ పై పోరులో రాజీలేదు, పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దు- జేపీ నడ్డా
25 June 2023, 16:52 IST
- JP Nadda : తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో భేటీ అయిన ఆయన బీఆర్ఎస్ పై పోరులో రాజీలేదని స్పష్టంచేశారు.
జేపీ నడ్డా తెలంగాణ టూర్
JP Nadda : బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా నోవాటెల్ హోటల్ కు బయలుదేరివెళ్లారు. నోవాటెల్ లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందర్ రావు, విజయశాంతి, వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారని తెలుస్తోంది. పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ ల ఇళ్లకు వెళ్లి... జేపీ నడ్డా వారిని సత్కరించనున్నారు.
బీఆర్ఎస్ తో నో కాంప్రమైజ్
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నాయకత్వానికి పిలుపునిచ్చారు. అంతేకాదు పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు. నోవాటెల్ హోటల్ జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలతో నడ్డా చర్చించారు. ఎన్నికల సన్నద్ధతపై నేతలు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ తో రాజీలేదని స్పష్టం చేసిన నడ్డా.... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో సీరియస్ ఫైట్ ఉంటుందని పేర్కొన్నారు.
జేపీ నడ్డా టూర్
దిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా...ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 వరకు సంపర్క్ సే అభియాన్లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడారు. తర్వాత జూబ్లీహిల్స్లో క్లాసికల్ డ్యాన్సర్ పద్మశ్రీ ఆనంద శంకర ఇంటికి వెళ్లారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును కలిసి, ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన, అభివృద్ధి గురించి వివరించి పుస్తకాలు అందజేశారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నాగర్ కర్నూల్ సభకు హెలికాప్టర్లో బయలుదేరతారు. 4.45 నిమిషాలకు నాగర్ కర్నూల్ చేరుకుని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జేపీ నడ్డా. సభ అనంతరం నాగర్ కర్నూల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆదివారం రాత్రి 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి తిరువనంతపురం చేరుకుంటారు.