93 Years Old Earns PhD : బామ్మా నువ్వు తోపు! 93 ఏళ్ల వయసులో పీహెచ్డీ
01 November 2023, 19:31 IST
- 93 Years Old Earns PhD : చదువుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి రుజువైంది. 93 ఏళ్ల వయసులో ఓ బామ్మ పీహెచ్డీ పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవం
93 Years Old Earns PhD : హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం 83వ స్నాతకోత్సవం కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో 93 ఏళ్ల బామ్మ ఆంగ్లంలో పీహెచ్డీ పట్టా అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు.
93 ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా పొందిన బామ్మ
హైదరాబాద్ కు చెందిన రేవతి లెక్చరర్ గా పని చేసి 1990లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం ఆమె అక్కడితో ఆగిపోలేదు. తన చదువును ఇంకా కొనసాగించాలని అనుకుని ఆంగ్లంలో పీహెచ్డీ చేయాలని గట్టి పట్టుపట్టారు. అందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ సైతం పొందారు. తుంగవోలు రేవతి ఆంగ్ల భాషా వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. ఆమె చేసిన పరిశోధనలకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవలె జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో పీహెచ్డీ పట్టాను అందచేసింది. కాగా 93 ఏళ్ల వయసులో బామ్మ పీహెచ్డీ పట్టాను పొంది ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
58 మందికి బంగారు పతకాలు
మంగళవారం ఠాకూర్ ఆడిటోరియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శంతను నారాయణకు యూనివర్సిటీ యాజమాన్యం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇదిలా ఉండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో 1,024 మంది ప్రముఖులు పీహెచ్డీ పట్టాను పొందడం ఇదే మొదటిసారి. అలాగే ఓయూ పరిధిలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 58 మందికి బంగారు పతకాలు అందచేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్