Medaram 2022 | మెుదట్లో సమ్మక్క జాతర జరిగింది మేడారంలో కాదు.. ఇదిగో ఈ గ్రామంలోనే
15 February 2022, 10:58 IST
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. జన జాతరలా మారింది. ఎటుచూసినా.. వనదేవతల నామస్మరణే. అయితే మెుదటి నుంచి మేడారంలోనే ఈ జాతర జరిగిందా? సమ్మక్క పుట్టింది ఎక్కడ? ప్రస్తుతం ఆ గ్రామం ఎక్కడుంది?
సమ్మక్క సారలమ్మ జాతర
రెండేళ్లకోసారి జరిగే.. మేడారం జాతరకు లక్షలమంది వస్తుంటారు. అమ్మవార్లను దర్శించుకుని తమ కోర్కెలను చెప్పుకుంటారు. కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మను కొలుస్తారు. అయితే మెుదటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర జరిగింది వేరే గ్రామంలో. కానీ రానురాను మేడారానికి వచ్చింది. ఇక ఇప్పుడు జాతర అంటే మేడారమే అయిపోయింది. అసలు సమ్మక్క, సారలమ్మ జాతర ఏ గ్రామంలో మెుదలైంది? మేడారం ఎందుకొచ్చింది?
సమ్మక్క బయ్యక్కపేటలో పెరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గ్రామానికి చెందిన కోయదొరలే.. సమ్మక్కను పెంచి పెద్ద చేసినట్టు చెబుతుంటారు. బయ్యక్కపేట పక్కన దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. వెదురు చెట్టు కింద పెట్టేలో బంగారు వర్ణ ఛాయతో వెలిగిపోతున్న ఓ పసిబిడ్డ కనిపించింది. ఆమెను చేరదీసి.. పెంచారు. చందా వంశానికి చెందినవారు ఈ వనదేవతను తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ వంశానికి చెందినవారు సమ్మక్కను తమ ఆడబిడ్డగానే భావిస్తారు.
మేడారానికి జాతర ఎలా వచ్చింది?
ఇప్పుడు సమ్మక్క-సారలమ్మ జాతర అంటే... ఎవరైనా మేడారం అనే చెబుతారు. కానీ నిజానికి వేరే కథ ఉంది. ఈ జాతర 1942 కంటే ముందు.. మేడారం పక్కనే ఉన్న బయ్యక్కపేటలో జరిపేవారు. ఎందుకంటే.. ఇక్కడే సమ్మక్క పెరిగింది. అటవీ ప్రాంతంలో వనదేవత దొరికింది కూడా ఇక్కడే. దీంతో సమ్మక్క పుట్టింది కూడా ఈ అటవీ ప్రాంతంలోననే నమ్ముతారు. అందుకే.. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలాతో మొదట్లో బయ్యక్కపేటలోనే జాతర నిర్వహించేవారట.
రామాయణంలో జనకుడికి సీత ఎలా దొరికిందో.. ఇక్కడ ఆదివాసులకు సమ్మక్క అలా లభించిందని చరిత్ర చెబుతోంది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి.. పెంచిపెద్ద చేశారు. సామాన్య జనంలో సమ్మక్క ఉండలేక.. పక్కనే ఉన్న దేవరగుట్ట పైకి వెళ్లిందంటారు. అక్కడే అమ్మవారు అవసరాలు తీర్చేందుకు ఏర్పడిన బావిని జలకబావి అని పిలుస్తారు. సమ్మక్క పసితనం అంతా బయ్యక్కపేటలోనే. కానీ అంతర్దానమైంది మాత్రం మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై. సమ్మక్క కోసం గాలిస్తున్న ఆదివాసులకు కుంకుమ భరణి రూపంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత జాతర చేయడం ప్రారంభమైంది.
అయితే కాలక్రమేణా.. బయ్యక్కపేటలో కరవు ఎక్కువైంది. జాతరను నిర్వహించే శక్తి తగ్గిపోయింది. మరోవైపు దాయాదుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి.. సమ్మక్క జాతరను బయ్యక్క పేట నుంచి మేడారానికి మార్చి నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. జాతరను మేడారానికి తరలించే సమయంలో లిఖిత పూర్వక ఒప్పందాలు కూడా జరిగాయట. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ చందా వంశీయుల వద్ద ఉన్నాయి. ఇక 1942లో అలా జాతరను మేడారానికి తరలించారు. అప్పటి నుంచి మేడారం వన దేవత జాతర మొదలైంది.
టాపిక్