Mahabubnagar: వరసకు కూతురు.. రేప్ చేసి హత్య చేసిన బాబాయ్..! మరో ముగ్గురు కూడా…!
03 December 2022, 13:59 IST
- Mahabubnagar District Crime News: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరసకు కూతురయ్యే బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు సొంత బాబాయ్. మరో ముగ్గురు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లాలో బాలిక హత్య
Gang Rape On Girl in Mahabubnagar District: ఇంట్లోవారు పని మీద హైదరాబాద్ వెళ్లారు. అయితే పదో తరగతి చదువుతున్న కుమార్తె మాత్రం ఇంట్లోనే ఉంది. ఇదే అదునుగా భావించారు కొందరు వ్యక్తులు.! ఏకంగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. పైగా హత్య కూడా చేశారు. ఇందులో వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తి కూడా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని ఓ తండాలో చోటు చేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.....
బాలానగర్ మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక పదో తరగతి(16) చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు పని మీద హైదరాబాద్ వెళ్లారు. బాలిక మాత్రం ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలోనే బాలిక ఇంటికి శ్రీనివాస్ (వరసకు బాబాయ్)తో పాటు మరో ముగ్గురు వెళ్లారు. బలవంతంగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.దీంతో బాలిక తీవ్రంగా ప్రతిఘటించటంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పారిపోయారు.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..!
బాలిక చనిపోవటంతో నిందితులు అప్రమత్తమయ్యారు. బాలికను ఫ్యాన్ కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే బాలిక చనిపోవటంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ఉన్న వారి ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి రిపేర్ షాప్ ను ధ్వంసం చేశారు. సామాగ్రిని బయటపడేశారు.
ఈ దారుణ ఘటనపై బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణలో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. రేప్ చేసి హత్య చేశారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనేది తెలియనుంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.