TS Eamcet Counselling: తెలంగాణలో బైపీసీ చివరి విడత కౌన్సిలింగ్ ప్రారంభం
18 September 2023, 11:58 IST
- TS Eamcet Counselling: తెలంగాణలో బైపీసీ విద్యార్ధులకు చివరి విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. బీఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
టీఎస్ ఎంసెట్
TS Eamcet Counselling: తెలంగాణలో ఎంసెట్ బైపీసీ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంసెట్ బైపీసీ విభాగంలో పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మా డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభించారు.
తొలి విడత నిర్వహించిన కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్లో వాటిలో 9,168 సీట్లు భర్తీ అయ్యాయి. రెండు కోర్సుల్లో 194 సీట్లు మిగిలి పోయాయి. కొన్ని కాలేజీల్లో సీట్లు పొందిన వారు కూడా రిపోర్టింగ్ చేయకపోవడంతోపాటు కాకతీయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్ మరికొన్ని కళాశాలల్లో సీట్లకు అనుమతి ఇచ్చింది.
చివరి విడతకు బీ ఫార్మసీలో 3,523, ఫార్మా డి కోర్సులో 525 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 19న ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఈ నెల 20వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 23 లోపు సీట్లు కేటాయిస్తారు.
22 నుంచి ఐసెట్ చివరి విడత..
ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు ఈ నెల 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.