Dasoju Sravan | 'నవసంకల్ప్ చింతన్ శిబిర్' కోసం దాసోజు శ్రవణ్ సూచనలు
15 May 2022, 20:23 IST
- సంస్థాగత సంస్కరణల్లో భాగంగా బలహీన వర్గాలకు సాధికారత కల్పించే అంశంపై 'నవసంకల్ప్ చింతన్ శిబిర్' ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు.
దాసోజు శ్రవణ్
రాజస్థాన్లోని ఉదయ్ పూర్ వేదికగా నవసంకల్ప్ చింతన్ శిబిర్ జరిగింది. సమస్యలపై ప్రత్యేక ద్రుష్టితో సామాజిక న్యాయ సలహా మండలిని ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బలహీన వర్గాలకు సంస్థాగత పోస్టుల శాతాన్ని 20 నుంచి 50కి పెంచడం అభినందనీయమైన్నారు. అట్టడుగు స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశలో సంస్థాగత సంస్కరణల విధానంలో భాగంగా దాసోజు శ్రవణ్ పలు సూచనలు చేశారు.
1. భారతదేశం వివిధ కులాల సమ్మేళనం. అయితే కొన్ని కులాలు మాత్రమే ఈ దేశాన్ని పాలిస్తున్నాయి. ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నాయి. అణచివేత , ఉద్దేశపూర్వక వివక్షను అంతం చేయడానికి అలాగే సామాజిక న్యాయాన్ని అమలు చేయడానికి, భారతదేశం అంతటా కుల ఆధారిత జనాభా గణన అవసరాన్ని మనం బలంగా చెప్పాలి.
2. సామాజిక ఆర్థిక, రాజకీయ సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఎఐసీసీ, పీసీసీ, డీసీసీలలో ఎంబీసీ, సంచార తెగల విభాగం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఎంబీసీ, డి-నోటిఫైడ్ సంచార తెగల వారి పేదరికం స్థాయి, వారి రాజకీయ సాధికారత అవసరాన్ని గుర్తించాలి.
3. 73, 74వ సవరణల స్ఫూర్తిని పెద్దఎత్తున ముందుగు తీసుకెళ్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గీకరణ తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ ఈ వర్గ ప్రజలు గ్రామ సర్పంచీ, వార్డు మెంబర్ అయ్యే అవకాశం కూడా అందుకోలేదు. విద్య, ఉపాధి, రాజకీయాలను వర్తింపచేస్తూ కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ వర్గీకరణ అమలు చేస్తున్నారు. అట్టడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి ఎంబీసీలు, డి-నోటిఫైడ్ తెగలు, సంచార జాతులకు సాధికారత కల్పించడం వంటి బాధ్యతను నెరవేర్చడానికి ఇది ఏకైక మార్గం.
4. ఎంబీసీ, డి-నోటిఫైడ్ తెగలు, సంచార జాతులకు ఎమ్మెల్యే, ఎంఎల్సీ, ఎంపీ సీట్లను హేతుబద్ధమైన వాటా అందించడానికి ఎఐసీసీ తప్పనిసరిగా ఒక విధానాన్ని నిర్దేశించాలి.
5. అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్లు: ఓబీసీలు, ఎంబీసీలు, డి-నోటిఫైడ్ తెగలు, సంచార తెగలు అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఎన్నికలలో వారి న్యాయమైన వాటాను ఎన్నడూ పొందలేదు. అందువల్ల, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి శాసనసభ, పార్లమెంటులో ఓబీసి రిజర్వేషన్లు అమలు చేయాలి.
6. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదిరిగానే ఓబీసీ సాధికారత కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను వారి జనాభాకు అనుగుణంగా గణనీయమైన బడ్జెట్తో ఏర్పాటు చేయాలి.
7. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయ ప్రక్రియ అమలు కోసం ఒక యంత్రాంగం వుండాలి.
8. గ్రామీణ, పట్టణ ఆధారిత హస్తకళాకారుల కులాలకు ఆర్థిక సహాయం అందించడానికి వివిధ విధాన కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. ఇవి అట్టడుగు వర్గాలు ఆర్థికంగా స్థిరత్వం సాధించడంలో తోడ్పడతాయి.
ఇవన్నీ.. పరిశీలన కోసం ఈ అంశాలను విన్నవించినట్టుగా దాసోజు శ్రవణ్ చెప్పారు. తన సూచనలని మరింత విశదీకరించే అవసరం ఏర్పడితే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.