Cyber Crime : జస్టిస్ చంద్ర శర్మ ఫోటోతో సైబర్ మోసం
19 July 2022, 11:40 IST
- హైకోర్టు సీజే ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు లక్షల రుపాయలు కాజేశారు. అత్యవసర సమావేశంలో ఉన్నానని, నగదు బదిలీ చేయాలని కోరడంతో ఓ వ్యక్తి ముందు వెనుక ఆలోచించకుండా నగదు బదిలీ చేసి బుక్కయ్యాడు. చివరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని తెలిసి లోబదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు.
వాట్సాప్ డీపీతో లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫోటోతో సైబర్ నేరగాళ్లు రెండు లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఫోటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్గా పెట్టుకుని ఆయన పరిచయస్తుడిని బురిడీ కొట్టించారు. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారయణకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ డిపితో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి అత్యవసరంగా నగదు కావాలని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. సీజే తనను సాయం అడుగుతున్నారని భావించిన శ్రీమన్నారయణ రెండు లక్షల రుపాయలు ఆమెజాన్ కూపన్ల రూపంలో బదిలీ చేశారు.
నగదు బదిలీ తర్వాత సందేశాలు వచ్చిన ఖాతాతో సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో మోసపోయానని అర్ధమై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితులు వాట్సాప్ డీపీతో మోసం చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. సతీష్ చంద్రశర్మ ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. శ్రీమన్నారయణకు సీజేతో పరిచయం ఉండటంతో ఆయనే తనతో చాట్ చేస్తున్నారని భావించారు.
తాను ప్రత్యేక సమావేశంలో ఉన్నానని, తన వద్ద ఉన్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయని, తాను పంపే లింకును క్లిక్ చేసి రూ.2లక్షలను బదిలీచేయాలని సూచించారు. సీజే పేరుతో ఛాట్ చేసిన వ్యక్తి సూచించనట్లే అమెజాన్ కూపన్లను బదిలీ చేశారు. చివరకు మోసపోయానని తెలిసి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటీవలి కాలంలో ప్రముఖుల చిత్రాలతో సైబర్ నేరగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డీజీపీ మహీంధర్ రెడ్డి ఫోటోతో కూడా సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేశారు. పరిచయస్తులైనా వాట్సాప్ లింకులకు నగదు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకున్న తర్వాతే ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
టాపిక్