CPI Narayana On BRS : వంతెనలు కూలినట్టే కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది - సీపీఐ నారాయణ
26 October 2023, 19:22 IST
- CPI Narayana On KCR Govt: బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాష్ట్రంలో వంతెనలు కూలినట్టే కేసీఆర్ ప్రభుత్వం కూడా కూలిపోబోతుందని కామెంట్స్ చేశారు.
తీగల వంతెన వద్ద సీపీఐ నేతల బృందం
CPI Narayana On KCR Govt: కరీంనగర్ నగర శివారులో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్ బంధువులకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించే విధంగా పనులు పూర్తి చేసిన మంత్రి పై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేబుల్ బ్రిడ్జిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకట్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బంధువులకు,కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే కేబుల్ బ్రిడ్జి నిర్మించారని,వాటి నిర్మాణ పనులు మంత్రి గంగుల తన బంధువులకు అప్పజెప్పడంతోనే సంవత్సరం పూర్తికాకముందే పగుళ్లు ఏర్పడడం, కుంగిపోవడం,తారు రోడ్డు చెడిపోవడం, మానేరు రివర్ ఫ్రంట్ లో చెక్ డ్యాములు కొట్టుకపోవడం లాంటివి కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి తన పార్టీలోని మంత్రులు చేస్తున్న అవినీతి కనబడడం లేదా అని ప్రశ్నించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే బ్రిడ్జిలు ఏ విధంగానైతే కూలిపోతాయో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ కూలిపోక తప్పదని హెచ్చరించారు.కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అంశంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని సదరు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని చూస్తుంటే పైన పటారం లోన లొటారం లాగా ఉందని పైపై మెరుగులతో నిర్మాణం చేపట్టి అందంగా సుందరీకరణ చేసామని గొప్పలు చెప్పుకోవడం తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. అత్యుత్సాహంతో త్వరితగతిన పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కారన్నారు. కేబుల్ బ్రిడ్జిని చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకున్నట్లు ఉందని అంత మాత్రాన దాని అసలు రంగు బయటపడక మానదని… ఈ సామెతకు ఉదాహరణంగానే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఉందని ఎద్దేవా చేశారు. ఇది అందాల బ్రిడ్జి కాదని అడ్డగోలుగా దోచుకునే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కేబుల్ బ్రిడ్జి అందంగా అలంకరణగా ఉన్నదనే ఉద్దేశంతోనే ఇక్కడికి ప్రజలు సందర్శన కోసం వస్తారని… నాణ్యత ప్రమాణాలు దెబ్బతిని ప్రమాదవశాత్తు బ్రిడ్జి కూలిపోతే అనేకమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.