Munugode CPI: మునుగోడు తమకు కేటాయించాల్సిందేనంటున్న సీపీఐ
25 October 2023, 6:13 IST
- Munugode CPI: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మనుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టు వీడేలా లేదు..వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎం చర్చలు జరుపుతున్నాయి.
మునుగోడు కావాల్సిందేనని పట్టు బడుతున్న సిపిఐ
Munugode CPI: పొత్తుల చర్చల్లో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు, సీపీఎంకు ఒక స్థానం కేటాయించే అంశంలో సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. సీపీఐ కోరిన స్థానాలు కాకుండా జనరల్ స్థానమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరును కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనికి సీపీఐ రాష్ట్ర నాయకత్వం ముందు పచ్చ జెండా ఊపింది.
అయితే సొంత టికెట్ కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివా రావు రాజీపడుతున్నారని నల్గొండ జిల్లా సీపీఐ నాయకులు ఆరోపించారు. ఈ కేటాయింపులను తాము అంగీకరించమని, స్వతంత్రంగానైనా పోటీకి దిగుతామని నల్లగొండ సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం కుండబద్దలు కొట్టారు. దీంతో పునరాలోచనలో పడిని సీపీఐ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో నల్లగొండ సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది.
మునుగోడులో సీపీఐ పోటీ చేస్తుందని తీర్మానం
తమకు ఏమాత్రం పట్టులేని, గత ఎన్నికల్లో పోటీ చేసిన రికార్డు కూడా లేని చెన్నూరు ను తీసుకోమనడం ఏమిటనే ప్రశ్న సీపీఐ నాయకుల నుంచి వస్తోంది. అయిదు సార్లు తాము ప్రాతినిధ్యం వహించిన మునుగోడు ను ఇవ్వలేమనడం ఎంత వరకు సబబన్న అంశంపై చర్చ జరిగింది. ‘ బలమైన పార్టీ క్యాడర్, గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తమకు మునుగోడు సీటు కేటాయించాలని లేదా సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది...’’ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ‘ హిందుస్తాన్ టైమ్స్ - తెలుగు’ తో పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనా చర్చించారు. నల్గొండ జిల్లాలో బలమైన ఉద్యమ చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని లేని పక్షంలో సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర కమిటీలను జిల్లా కౌన్సిల్ సమావేశంలో కోరారు. 2018 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా, పొత్తులో ప్రతిసారి మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐ కి కేటాయించక పోవడంతో పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పొత్తులు ఎప్పటికి తేలేను..?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఐ, సీపీఎం లకు చెరో నియోజకవర్గం కావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సీపీఐ మునుగోడును కోరుతుండగా, సీపీఎం మిర్యాలగూడ నియోజకవర్గం కేటాయించాలని అడుగుతోంది. మిర్యాలగూడ విషయంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి అభ్యంతరం కనిపించక పోయినా.. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
ఇప్పటికే ఎన్నికల కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ పార్టీ నాయకుడు , మిర్యాలగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన వర్గం సీపీఎం కు టికెట్ కేటాయించవద్దని, ‘ సేవ్ కాంగ్రెస్ .. సేవ్ మిర్యాలగూడ ’ అంటూ ఆందోళన మొదలు పెట్టారు. మరో వైపు సీపీఐ అడిగిన మునుగోడు ను కాకుండా కాంగ్రెస్ చెన్నూరును ఆఫర్ చేస్తోంది. దీంతో సీట్ల వ్యవహారం ఎటూ తేలకపోవడం కూడా అటు కాంగ్రెస్, ఇటు వామపక్ష పార్టీల కార్యకర్తలో ఇంకా గందరగోళం, అయోమయం నెలకొని ఉంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )