DH Srinivasa Rao on Corona : ఏసు దయతోనే కరోనా తగ్గింది : డీహెచ్ శ్రీనివాసరావు
21 December 2022, 22:34 IST
- DH Srinivasa Rao on Corona : ఏసుక్రీస్తు కృపతోనే కరోనా తగ్గిందంటూ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలోను పలు సందర్భాల్లో ఆయన తీరు వివాదాస్పదమైంది.
డీహెచ్ శ్రీనివాసరావు
DH Srinivasa Rao on Corona : తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా తగ్గిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా... శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని.. ఏసు క్రీస్తు కృపతోనే కరోనా నుంచి మనం విముక్తులయ్యామని అన్నారు. మంచిని ఆచరించాలన్న అన్ని ధర్మాల సూచనను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చిందని... వీటితోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ జాతిని కాపాడుకున్నామని చెప్పారు.
"ఆధునిక సంస్కృతికి.. మన దేశానికి.. మన రాష్ట్రానికి.. వారధులు కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే. ఈ విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేది. ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదు. ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో.. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసింది. గత రెండున్నర సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల ప్రపంచ మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దాని నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యాం. అది మనం చేసిన సేవల వల్ల కాదు. ఏసు క్రీస్తు కృప, ఏసు క్రీస్తు దైవం యెుక్క దయ, ప్రభావం" అని శ్రీనివాస రావు అన్నారు.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా ఉన్న గడల శ్రీనివాసరావు.. గతంలోను పలు మార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలో తనకి తాను దేవతగా ప్రకటించుకున్న ఎంపీపీ విజయలక్ష్మి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీనివాసరావు పూజలు చేశారు. అలాగే.. ఆయన పలుమార్లు కేసీఆర్ కాళ్లు మొక్కడంపై విమర్శలు వచ్చాయి. కరోనా కట్టడిలో వైద్యశాఖ పరంగా కీలకంగా వ్యవహరించారు. అనేక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. వైద్యులతో కలిసి సేవలు అందించారు. అయితే.. మనం చేసిన సేవలతో కాదని.. ఏసుక్రీస్తు దయతోనే కరోనా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదం అవుతోంది.