BJP Vs TRS : బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. పలిమెలలో కార్యకర్తల రాళ్ల దాడి
01 November 2022, 15:37 IST
- Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది.. పరిస్థితులు మారిపోతున్నాయి. తాజాగా మునుగోడు మండలం పలిమెలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్ల దాడి
పలిమెలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) కాన్వాయ్ పై దాడి జరిగింది. పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ.. మండిపడ్డారు ఈటల. ఇరువర్గాలు కర్రలు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. మరోవైపు రాళ్లదాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
'ఓటమి భయంతోనే బీజెపీ… టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు సమన్వయం పాటించాలి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS) గెలవబోతుందని తెలిసి బీజేపీ నిరాశ, నిస్పృహతో ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు పడకుండా సమన్వయం పాటించాలి.' అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ మండిపడుతోంది. ఈటల రాజేందర్ పై కావాలనే రాళ్ల దాడి చేశారని ఆరోపిస్తోంది. దగ్గర ఉండి పల్లా రాజేశ్వర రెడ్డి దాడి చేయించారంటోంది. ఈ ఘటనలో ఈటల వాహనం ధ్వంసమైంది. ఈటల వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు.
మునుగోడు పలివెల(Palimela)లో దాడి ఘటనపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయని తెలిపారు. తన గన్మెన్లు, పీఏ, మరికొందరు గాయపడ్డారని చెప్పారు.
'దాడిలో కొన్ని వాహనాలూ ధ్వంసమయ్యాయి. దాడులు చేయడం బీజేపీ సంస్కృతి కాదు. మునుగోడు ప్రజలు(Munugode People) అంతా గమనిస్తున్నారు. టీఆర్ఎశ్ చెంప చెల్లుమనే తీర్పు ఇస్తారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులకు పాల్పడుతున్నారు.' అని ఈటల అన్నారు.