Bjp Kishan Reddy : కొడుకు కోసమే కేసీఆర్ డ్రామాలు….. కిషన్ రెడ్డి
04 November 2022, 13:34 IST
- Bjp Kishan Reddy కొడుకును ముఖ్యమంత్రి చేయడానికే కేసీఆర్ రకరకాల డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీడియా ముందు బాధపడుతున్న కేసీఆర్, 2014 నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఎన్ని పార్టీల గొంతు నొక్కారో గుర్తు చేసుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ జాతి రత్నాలతో చక్కటి స్క్రీన్ ప్లే చేశారని విమర్శించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Bjp Kishan Reddy కేసీఆర్ శోకతప్త హృదయంతో దేశం గురించి ప్రజాస్వామ్యం గురించి, నైతిక విలువల గురించి బాధపడుతూ చాలా విషయాలు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ విడుదల చేసిన సిన్మా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మొత్తం సిన్మా ఊహాజనిత ఆలోచనలతో సాగుతోందన్నారు.
స్వామిజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయనుకుంటే చేయగలిగిందేమి లేదన్నారు. రోహిత్ రెడ్డి నీతివంతుడైనట్టు మాట్లాడుతున్నారని, ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రత్నాలు, ఆత్మగౌరవానికి ప్రతిబింబాలని చెబుతున్నారని, వారిలో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారని, వారు ఎలా టిఆర్ఎస్ రత్నాలు అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చెప్పిందే సాగదీసి , డిక్షనరీ వెదికి భాష ప్రయోగిస్తూ పాత రికార్డు తిరగేశారన్నారు.
అసత్యాన్ని, అక్రోశాన్ని, అభద్రతా భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఏకరవు పెట్టారని, సిఎం పదవిని తనకు తాను చులకన చేయడమే తప్ప కేసీఆర్ చెప్పిన దాంట్లో చర్చించుకునే విషయం ఏమి లేదన్నారు.
ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల వారిని చేర్చుకునే శక్తి తమకు ఉందని, దానికి బ్రోకర్లు, స్వామిజీల అవసరం లేదన్నారు. బ్రోకర్ల ద్వారా పార్టీలో చేర్చుకునే అలవాటు టిఆర్ఎస్కు ఉందని, బీజేపీ బరిగీసి, పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటామన్నారు.బీజేపీ చిన్నపార్టీ ఆషామాషీ పార్టీ కాదని, బ్రోకర్లతో పార్టీలో చేర్చుకోవాల్సిన అంతకంటే బీజేపీకి లేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని,వ్యవస్థల అపహాస్యం అంటూ మాట్లాడుతున్నారని, తొమ్మిదేళ్లుగా ఎలాంటి పాలన చేస్తున్నారో అందరికి తెలుసన్నారు.
టిఆర్ఎస్ రాకముందు, వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా నడుస్తుందో గుర్తు చేసుకోవాలన్నారు. నెలలో 15రోజులు ఫాం హౌస్లో ఉండే ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యం గురించి ఏమి చెబుతున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు రోజుకు ఎన్నిక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావుల్ని కలిసేవారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ ప్రజా స్వామ్యం గురించి నీతులు వల్లిస్తున్నారని, దళారుల్ని తప్ప ఎవరిని కలవరని ఎద్దేవా చేశారు.
వీడియోలో ఏముంది…?
కేసీఆర్ ప్రెస్మీట్లో చూపించిన వీడియోలో ఏముందో అర్థం కాలేదన్నారు. తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అధిష్టానం తమతో మాట్లాడుతుందని, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన రోహిత్ రెడ్డితో స్వామిజీలు మాట్లాడితే దానికి బీజేపీతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీకి టిఆర్ఎస్ పార్టీ పడిపోవాలనే తొందర లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. తన తర్వాత తన కొడుకు సిఎం కావాలనే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని చెప్పారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. నలుగురు ఆర్టిస్టుల్ని అటు ఇటు కూర్చోబెట్టి ప్రజల్ని అమాయకుల్ని చేయాలని చేయాలనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేవన్నారు. ఏపీలో స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు డ్రామా ఆడినట్టే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో డ్రామా ఆడుతున్నారని చెప్పారు.
భారత హోంమంత్రితో ఎవరైనా కలిసి ఉండొచ్చని, ఫోటోలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బయట వ్యక్తులతో బేరసారాలు చేయాల్సిన కర్మకు తమకు లేదన్నారు.పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే కేసీఆర్ టీడీపీ, వైఎస్సార్సీపీ, బిఎస్సీ, సిపిఐల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ప్రజా స్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇతర పార్టీల్లో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారి గురించి కేసీఆర్ ఏం చెబుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లోక్ నాయక్ జయప్రకాష్ తర్వాత తానే నాయకుడినని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టిఆర్ఎస్లో చేర్చుకున్నపుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదనా అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్పై చెప్పులు వేయడం కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని, వైస్రాయ్ హోటల్లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. జయప్రకాష్ నారాయణ, ఎన్టీఆర్ వంటి వారిపేర్లు ఎత్తే అర్హత కేసీఆర్కు లేదన్నారు. తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని,ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలుగుతామని ప్రశ్నించారు. కేసీఆర్కు ఏ మాత్రం న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉన్నా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని సవాలు చేశారు.