Balapur Ganesh Laddu: రూ.27లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ
28 September 2023, 11:07 IST
- Balapur Ganesh Laddu: గణేష్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడి చేతిలో కొలువైన లడ్డూ వేలం పాట ఉత్సాంగా జరిగింది. 1994లో కేవలం రూ.450రుపాయలతో మొదలైన లడ్డూ వేలం నేడు రూ.27లక్షలకు చేరింది.
లడ్డూను దక్కించుకుని దాసరి దయానందరెడ్డి
Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను తుర్కయాంజిల్కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి పాడుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తన తల్లితండ్రులకు కానుకగా ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వేలంలో పాల్గొన్నా రూ.22లక్షల రుపాయల వద్ద వేలంలో తాను ఆగిపోయినట్లు చెప్పారు.
బాలాపూర్ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. గత ఏడాది లడ్డూను వేలంలో రూ.24.60లక్షలకు విక్రయించారు. ఈ ఏడాది రూ.27లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది నుంచి లడ్డూ వేలంలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉత్సవ కమిటీ తీర్మానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి వేలంలో లడ్డూ పాడుకున్న వారు అదే ఏడాది డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వేలం సొమ్ములు చెల్లించడానికి గడువు ఇచ్చే వారు. ఇకపై వేలం సొమ్మును అదే ఏడాది చెల్లించాలని నిర్ణయించారు.