AP TS Rains : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు- వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
13 August 2023, 20:30 IST
- AP TS Rains : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతోంది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఏపీ, తెలంగాణలో వర్షాలు
AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగ్లాదేశ్, మయన్మార్ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీచేసింది. శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం తేలికపాటి వర్షాలు కురిసాయి. నల్గొండ జిల్లా ఘన్పూర్లో 71 మిల్లీ మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 53 మి.మీ, ఖమ్మం జిల్లా లింగాలలో 43 మి.మీ, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, మధిరలో 39, బోడకొండలో 39 మి.మీ వర్షపాతం రికార్డు అయింది.
ఏపీలో వర్షాలు
ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా.. వచ్చే రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏపీ తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సోమవారం చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం , ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.