Krishna Water Dispute: తెలంగాణ వాటా నీళ్లు వాడేశారు.. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు
14 April 2023, 9:20 IST
- Krishna Water Dispute: వేసవికి ముందే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నీటిని వాడేశారని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీరు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే చెందుతుందని ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మద్య కొత్త వివాదం
Krishna Water Dispute: వేసవితో పాటు కృష్ణా నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. గత ఏడాది ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో నీటికి ఏ ఇబ్బంది లేకపోయింది. ఈ ఏడాది వేసవికి ముందే జల జగడాలు మొదలయ్యాయి. తెలంగాణపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
కృష్ణా జలాల్లో అంగీకరించిన వాటా కంటే తెలంగాణ ప్రభుత్వం 90.36 టీఎంసీల నీటిని వాడుకుందని.. రెండు తెలుగు రాష్ట్రాల నడు ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాగునీటి అవసరాలు, ఉద్యాన పంటలు, సాగు చేసిన పంటలను రక్షించుకోవడం కోసం సాగర్ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు 1 టీఎంసీని విడుదల చేస్తూ తక్షణమే ఉత్తర్వులివ్వాలని కోరింది. ఈ మేరకు కృష్ణా నీటి యాజమాన్య బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు.
కృష్ణా నదిలో దిగువ కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న జలాలు 961.07 టీఎంసీలు అని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఇందులో అంగీకరించిన మేరకు ఏపీ వాటా 66శాతం జలాలకు 634.30 టీఎంసీలు, (తెలంగాణ వాటాకు 34 శాతంలో 326.77 టీఎంసీలు నీరు దక్కాల్సి ఉందన్నారు.
ఏప్రిల్ 12 వరకూ ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం 470.63 టీఎంసీలు, తెలంగాణ 417.13 టీఎంసీల నీటిని వాడుకున్నాయని పేర్కొన్నారు. ఏపీ కోటా కింద ఇంకా 163.67 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ సర్కార్ కోటా కంటే ఎక్కువగా 90.36 టీఎంసీలు అధికంగా వాడుకుందని వివరించారు.
ఏప్రిల్ 12 నాటికి శ్రీశైలం, సాగర్లలో నిల్వ ఉన్న 126.01 టీఎంసీల జలాలు ఏపీకి చెందుతాయన్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేసి, దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.