Adilabad Double Murders: వీడిన ఆదిలాబాద్ జంట హత్యల మిస్టరీ..భర్తే అసలు నిందితుడు
03 May 2023, 6:21 IST
- Adilabad Double Murders: ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక బంధువులతో కలిసి హతమార్చినట్లు గుర్తించారు.
జంట హత్యల కేసు వివరాలను వెల్లడిస్తున్న పోలీసులు
Adilabad Double Murders: ఆదిలాబాద్ జిల్లా సీతాగొందిలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. జిల్లాలో వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన జంట హత్యల కేసును ఆదిలాబాద్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహితతో పాటు యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
సుందరయ్య నగర్కు చెందిన మృతురాలి భర్త సోన్కాంబ్లె రమేష్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పరారీలో ఉన్న రమేష్ చెల్లెళ్లు, బావల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఏ-2గా సుందరయ్య నగర్కు చెందిన స్వప్న, ఖుర్శిద్ నగర్కు చెందిన ఏ-3 చదల్వార్ వెంకటేశ్, ఏ-4 చదల్వార్ శీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు.
సుందరయ్యనగర్కు చెందిన సోన్కాంబ్లె రమేష్తో కేఆర్కే కాలనీకి చెందిన అశ్వినికి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా మూడు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో భుక్తాపూర్కు చెందిన రెహమాన్తో పరిచయమై, అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పలుమార్లు పిల్లలతో కలిసి రెహమాన్తో గుడిహత్నూర్ మండలం సీతాగొంది క్షేత్రానికి వెళ్లింది.
ఈ క్రమంలో అశ్వినికి కుటుంబ సభ్యులు, భర్త నచ్చజెప్పటంతో ఏప్రిల్ 28న భర్తతో కలిసి విడిగా ఉండటానికి అంగీకరించింది. దీంతో రమేష్ అద్దె ఇల్లు తీసుకున్నాడు. అద్దె ఇంటిని శుభ్రం చేయటానికి భార్య రావాల్సి ఉండగా ఆమె రాక పోవటంతో రమేష్ అత్తగారింటికి వెళ్లాడు. రెహమాన్తో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిందని తండ్రికి కుమారుడు చెప్పాడు.
నిందితుడు రమేష్ గుడిహత్నూర్ మండలం సీతాగొంది వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వెదికాడు. వ్యవసాయ క్షేత్రంలో అశ్విని,రెహమాన్ కలిసి ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని తన బావ వెంకటేశ్, చెల్లెళ్లు స్వప్న, చదల్వార్ శీలకు ఫోన్లో తెలిపాడు. నిందితుడి చెల్లెళ్లు, బావ అక్కడకు చేరుకున్న తర్వాత అశ్విని, రెహమాన్ ఉన్న పొదల వద్దకు వెళ్లి కర్రలతో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో రెహమాన్ అక్కడికక్కడే చనిపోయాడు.
దాడి నుంచి తప్పించుకోడానికి అశ్విని పారిపోయే ప్రయత్నం చేసింది. అంతా కలిసి ఆమెపై దాడి చేయడంతో, ఆమె కూడా మృతి చెందింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. 29వ తేదీ శుక్రవారం స్థానికులు శవాలను చూడటంతో హత్యల విషయం వెలుగు చూసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో భర్త హత్య చేసి ఉంటాడన్న కోణంలో విచారణ ప్రారంభించి సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించారు. రెండు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.