Woman Murder: అమ్మేసిన బిడ్డను చూడ్డానికి వచ్చిందని, షాద్నగర్లో మహిళ దారుణ హత్య
03 May 2023, 9:41 IST
- Woman Murder: ఆర్ధిక ఇబ్బందులతో అమ్మేసిన బిడ్డను చూసుకోడానికి రావడమే ఆ తల్లి చేసిన పాపం అయ్యింది. బిడ్డను విక్రయించే పదేపదే చూడ్డానికి వస్తోందనే కోపంతో దారుణంగా హత్య చేసిన ఘటన షాద్నగర్లో జరిగింది.
బిడ్డను తిరిగి ఇవ్వమన్నందుకు తల్లిని హత్య చేసిన దంపతులు
Woman Murder: బిడ్డను పోషించలేక ఆర్ధిక ఇబ్బందులతో అమ్మేసిన ఓ తల్లి, కడుపుతీని చంపుకోలేక బిడ్డను చూడ్డానికి రావడమే శాపమైంది. బిడ్డను అమ్మేసి పదేపదే చూడ్డాని వచ్చి విసిగిస్తోందనే కోపంతో బాలుడిని కొన్న భార్యాభర్తలు ఆమెను హతమార్చారు.
షాద్నగర్ మునిసిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి శివార్లలో ఈ ఘటన జరిగింది. షాద్ నగర్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బిహార్కు చెందిన దేవకి (30) గర్భిణిగా ఉండగా కొద్ది నెలల క్రితం భర్త వదిలేశాడు. ఒంటరిగా జీవిస్తున్న ఆమె రెండు నెలల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాను బిడ్డను సాకలేనని అమ్మడానికి సిద్ధపడింది.
ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి సాయంతో షాద్నగర్ పటేల్రోడ్డులో నివాసం ఉండే రాములు, శారద దంపతులను కలిశారు. బీహార్ యువతిని తన రెండో భార్యగా పరిచయం చేసిన పురుషోత్తం, రాములు దంపతులకు మగబిడ్డను విక్రయిస్తానని చెప్పాడు. రాములు దంపతులకు అప్పటికే 13 ఏళ్ల కుమార్తె ఉంది. మగపిల్లాడు లేకపోవడంతో బాలుణ్ని పెంచుకోవాలనుకున్నారు. పురుషోత్తం ద్వారా బాలుడిని రూ.లక్షన్నరకు కొనుగోలు చేశారు.
కొడుకు మీద ప్రేమను చంపుకోలేకపోయిన దేవకి, తన కొడుకును తనకు ఇవ్వాలని, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానంటూ కొద్దిరోజులుగా రాములు ఇంటికి వెళ్తున్నారు. బిడ్డను వదులుకోవడం ఇష్టం లేని రాములు ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి కుమారుడిని అడగడానికి వచ్చిన దేవకిని.. చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. తరువాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి మునిసిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి శివారులో రోడ్డు పక్కన పడేశాడు.
సోమవారం అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లు రఫీ, భూపాల్రెడ్డి, డ్రైవర్ గోవిందులు ఆ గోనె సంచిని గమనించి అనుమానంతో తెరిచారు. అందులో మహిళ శవం కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు. సీఐ నవీన్కుమార్, ఇతర అధికారులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడినిగుర్తించారు. 12 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. నిందితుడు రాములును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన కానిస్టేబుళ్లు రఫీ, భూపాల్రెడ్డిలకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రివార్డులు అందించారు.