Complaint on Kaleswaram: కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు కోసం ఏసీబీకి ఫిర్యాదు
08 December 2023, 8:26 IST
- Complaint on Kaleswaram: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తొలి రోజే బిఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై ఏసీబీకి ఫిర్యాదు అందింది. కాళేశ్వరం అక్రమాలపై విచారణకు న్యాయవాది ఏసీబీని ఆశ్రయించారు.
కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు
Complaint on Kaleswaram: దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని.... దాని పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాజీ సీఎం కేసీఆర్పై ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, కాంట్రాక్టర్ మేఘా కృష్ణ రెడ్డి మరియు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు పై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో రాపోలు భాస్కర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని,నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్ ,కరీంనగర్,మెదక్,వరంగల్,నల్గొండ,రంగారెడ్డి జిల్లాలకు త్రాగు నీరు ,సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిర్ణయం జరిగిందని భాస్కర్ ఆరోపించారు.
మొత్తం 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, పనులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఏర్పడిందని అప్పుడే సీఎంగా కేసిఆర్, మంత్రులుగా హరీష్ రావు,కేటీఆర్,ఎంపిగా కవిత ఉన్నారని అప్పుడే ఈ అవినీతి జరిగిందని భాస్కర్ ఆరోపించారు.ఇక వీళ్లంతా కలిసి ప్రాజెక్ట్ అలైన్ మెంట్లు,డిజైన్ లు మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిని అంచననాను భారీగా పెంచారని భాస్కర్ ఆరోపించారు.
మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ప్రజాధనం దోచుకునేందుకు ముందే ప్రణాళికలను రచించుకున్నారని భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గురించి తన ఫిర్యాదులో భాస్కర్ ప్రస్తావించారు.
కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసిఆర్ అవినీతికి పాల్పడ్డారని ముందు నుంచి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే కేసిఆర్ పై ఎసిబికి ఫిర్యాదు చెయ్యడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)