WTC Final 2023 : ఆ నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!
15 May 2023, 11:24 IST
- World Test Championship Final 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచే ఇది అమలు అవుతుంది.
ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి సాఫ్ట్ సిగ్నల్(Soft Signal) నిబంధనను ఐసీసీ తొలగించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) నుంచే ఇదే అమలు అవుతుంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. క్రికెట్లో వివాదాలకు కారణం అవుతున్న ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదను సౌరవ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మైదానంలో సహజంగా వెలుతురు మందగించినప్పుడు ఫ్లడ్ లైట్స్ తో ఆటను కొనసాగించేలా కూడా మార్పులు తీసుకువచ్చిందని ఆ వెబ్ సైట్ పేర్కొంది.
సాఫ్ట్ సిగ్నల్ కారణంగా చాలా క్యాచ్ ఔట్ల విషయంలో దుమారం రేగింది. మైదానంలో సందేహస్పదంగా ఉన్న ఔట్.. విషయంలో అంపైర్లు.. థర్ట్ అంపైర్ కు నివేదిస్తూనే సాఫ్ట్ సిగ్నల్ రూపంలో ఔటా? నాటౌటా అని ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాలి. అంటే ఆ ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్ అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ రూపంలో చెప్పడమే.
రివ్యూల్లో స్పష్టత రాని సమయంలో, సరైన ఆధారాలు లభించనప్పుడు థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఇలా అనేక సందర్భాల్లో అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ కు కట్టుబడి తుది నిర్ణయం వెల్లడించడంపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతాయి. దీంతో సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను ఎత్తేయాలని ఐసీసీ(ICC) నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఇక తాజా మార్పుతో థర్డ్ అంపైరే తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. క్యాచ్ ఔట్ల విషయంలోనే ఎక్కువగా ఈ గందరగోళం ఉంటుంది. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 12ను రిజర్వేడేగా కేటాయించారు.
టాపిక్