World cup 2011 Final| ఆ 35 పరుగులు నా కెరీర్లో అతి ముఖ్యమైనవి: కోహ్లీ
02 April 2022, 13:02 IST
- 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ. మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు సచిన్ తనతో చెప్పిన మాటల గురించి కూడా వివరించాడు.
విరాట్ కోహ్లీ-సచిన్
క్రికెట్ ను ఇష్టపడే ప్రతి భారతీయుడు ఈ రోజును మర్చిపోలేడు. ఎందుకంటే 11 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియా ప్రపంచకప్ను రెండో సారి ముద్దాడింది. 28 ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ ధోనీ సారథ్యంలోని టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ(91) ఇన్నింగ్స్కు తోడు.. గౌతమ్ గంభీర్(97) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులాడుతూనే ఉంది. మహీ చివర్లో లాంగ్ ఆన్లో కొట్టిన సిక్స్ అయితే మ్యాచ్కే హైలెట్. నాటి మ్యాచ్ గురించి టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ తన జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. అప్పుడు 22 ఏళ్ల విరాట్.. ఆ మ్యాచ్లో సచిన్ తనకిచ్చిన మాటలను గుర్తు చేసుకున్నాడు.
"టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో సెకండ్ డౌన్లో నేను బ్యాటింగ్కు దిగాను. సచిన్, సెహ్వాగ్ ఇద్దరూ ఔటయ్యారు. నేను మైదానంలో అడుగుపెట్టేటప్పుడే సచిన్ ఔటై నాకు ఎదురుగా వస్తున్నాడు. భాగస్వామ్యాన్ని నిర్మించు(Build A Partnership) అని నాతో చెప్పాడు. నేను అదే ఫాలో అయ్యాను. గంభీర్తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాను. ఆ మొత్తం మ్యాచ్లో నావి కూడా 35 పరుగులు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బహుశా నా క్రికెట్ కెరీర్లోనే అవి నాకు అత్యంత ముఖ్యమైన 35 పరుగులు. ఈ మ్యాచ్లో నా వంతుగా 35 పరుగులతో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ప్రపంచకప్ గెలవడం నమ్మలేకపోతున్నాను. అక్కడ వాతావరణమంతా వందేమాతరం గీతాలతో ప్రతిధ్వనించింది. ఇప్పటికీ అవి నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి" అని విరాట్ కోహ్లీ తన ప్రపంచకప్ జ్ఞాపకాల గురించి చెప్పాడు.
2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్-శ్రీలంక మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 274 పరుగులు చేసింది. జయవర్థనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సెహ్వాక్, సచిన్ ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అలాంటి తరుణంలో 22 ఏళ్ల కోహ్లీ 35 పరుగులు చేశారు. గంభీర్తో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ల గంభీర్ 97 పరుగులతో ఆకట్టుకోగా.. మహేంద్రసింగ్ ధోనీ 91 పరుగుల అసామాన్య ప్రదర్శనతో టీమిండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ను గెల్చుకుంది.
టాపిక్