Virat Kohli: విరాట్ కోహ్లికి రెస్ట్ ఇవ్వడంపై దినేష్ కార్తీక్ రియాక్షన్ ఇదీ
19 July 2022, 14:26 IST
- Virat Kohli: అసలే ఫామ్లో లేక తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిని రెస్ట్ పేరుతో పక్కన పెట్టడం ఎంత వరకూ కరెక్ట్? దీనిపై తాజాగా దినేష్ కార్తీక్ కూడా స్పందించాడు.
విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ ఉంది. ఆ టోర్నీలో విరాట్ కోహ్లి ఉంటాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో లేని విరాట్.. అప్పటిలోపు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఛాన్స్ అతనికి దక్కేలా లేదు. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్ టీ20 సిరీస్లకు దూరంగా ఉన్న విరాట్ను.. ఇప్పుడు వెస్టిండీస్తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్లకు కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
ఫామ్లో లేని ఓ బ్యాటర్కు ఇలా విశ్రాంతినివ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కొందరు మాజీ క్రికెటర్లు ఈ నిర్ణయంపై పెదవి విరిచారు. ఎవరైనా ఆడితేనే ఫామ్లోకి వస్తారన్నది వాళ్ల వాదన. అయితే తాజాగా కోహ్లికి రెస్ట్ ఇవ్వడంపై అతని ఆర్సీబీ టీమ్మేట్ దినేష్ కార్తీక్ స్పందించాడు. ఇప్పుడు వెస్టిండీస్ వెళ్తున్న టీ20 టీమ్లో కార్తీక్ కూడా ఉన్నాడు.
అయితే కోహ్లికి రెస్ట్ నిర్ణయాన్ని కార్తీక్ సమర్థించాడు. "ఎంతోకాలంగా విరాట్ కోహ్లి చాలా సక్సెస్ను అనుభవించాడు. ఇప్పుడు అతనికి మంచి బ్రేక్ దొరుకుతుంది. ఈ బ్రేక్ తర్వాత అతడు రీఛార్జ్ అయి వచ్చి అద్భుతంగా రాణిస్తాడన్న నమ్మకం నాకుంది. అతనిలాంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం" అని కార్తీక్ స్పష్టం చేశాడు.
ఈ నెల 29 నుంచి వెస్టిండీస్లో ఇండియా టూర్ ప్రారంభం కానుంది. మొదట 3 వన్డేలు, ఆ తర్వాత 5 టీ20లు ఆడుతుంది. ఈ టూర్ నుంచి కోహ్లితోపాటు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.