WTC Final: గిల్ ఔట్ సరైన నిర్ణయమే: పాంటింగ్ వాదన.. తప్పేనన్న హర్భజన్
11 June 2023, 11:35 IST
- WTC Final: శుభ్మన్ గిల్ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని రికీ పాటింగ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు మాత్రం ఇది నాటౌట్ అని అంటున్నారు.
WTC Final: గిల్ ఔట్ సరైన నిర్ణయమే: పాంటింగ్ వాదన..
WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆట రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్.. ఔట్ వివాదాస్పదంగా మారింది. ఇది కచ్చితంగా నాటౌట్ అని చాలా మంది ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. లండన్ ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజైన శనివారం ఆటలో ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోల్యాండ్ వేసిన బంతి.. భారత ఆటగాడు శుభ్మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్కు తగిలి కామెరూన్ గ్రీన్కు క్యాచ్ వెళ్లింది. అయితే క్యాచ్ క్లీన్గా ఉందా లేదా అని చూసేందుకు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ను సంప్రదించారు. కాసేపు రిప్లేలు చూసిన థర్డ్ అంపైర్ కాటెల్బ్రా దాన్ని ఔట్గా ప్రకటించాడు. అయితే ఇది నాటౌట్ భారత అభిమానులు, కొందరు మాజీ ఆటగాళ్లు చెబుతుండటంతో వివాదం రేగింది. అయితే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు.
“నేను లైవ్లో చూసినప్పుడు.. క్యాచ్ అతడి (గ్రీన్) వరకు క్యారీ అయినట్టు కనిపించింది. అయితే, చాలా రిప్లేలు చూశాక నేను కూడా కచ్చితంగా ఏ అభిప్రాయానికి రాలేకపోయాను. అయితే, బాల్పై ఫీల్డర్ పూర్తి కంట్రోల్ ఉందని అంపైర్ భావించారు. అందుకే అది ఔట్” అని పాంటింగ్ అన్నాడు.
“దీని గురించి చాలా చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియాలో కంటే ఇండియాలోనే దీని గురించి ఎక్కువ మాటల నడుస్తున్నాయి. ఇండియాలోని ప్రతీ ఒక్కరూ ఇది నాటౌట్ అని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా వారేమో ఇది ఔట్ అని భావిస్తున్నారు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇచ్చి ఉంటే.. ఆ నిర్ణయాన్ని మార్చేందుకు ఆధారాన్ని థర్డ్ అంపైర్ కనుగొని ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే, బంతి నేలకు తాకిందనేలా తుది ఆధారం ఏదీ లేదని నేను అనుకుంటున్నా. సాఫ్ట్ సిగ్నల్ లేకున్నా.. థర్డ్ అంపైర్ అందుకే దీన్ని ఔట్గా ఇచ్చారని అనుకుంటున్నా. అందుకే థర్డ్ అంపైర్ తీసుకున్నది సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నా” అని పాంటింగ్.. ఐసీసీతో ఇంటర్వ్యూలో చెప్పాడు.
కాగా, శుభమన్ గిల్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని వీరేందర్ సెహ్వాగ్, వసీం జాఫర్ సహా చాలా మంది భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నాడేమో అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు సెహ్వాగ్.
అయితే, గిల్ది నాటౌట్ అని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. థర్డ్ అంపైర్ సరిగా జూమ్ చేసి చూడలేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. “కెమరూన్ గ్రీన్ రెండు చేతివేళ్లు బంతి కింద లేవు. అంటే బాల్ గ్రౌండ్ను టచ్ అయినట్టే భావించాలి. అందుకే అది నాటౌట్ ఇవ్వాల్సంది” అని స్పోర్ట్స్ కీడాతో హర్భజన్ సింగ్ అన్నాడు.
444 పరుగుల లక్ష్యఛేదనలో జోరుగా ఆడుతున్న గిల్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నాలుగో రోజు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (44 నాటౌట్), అజింక్య రహానే (20) క్రీజులో ఉన్నారు. ఇండియా గెలవాలంటే మ్యాచ్ చివరి రోజైన నేడు ఇంకా 280 పరుగులు చేయాలి.