Rohit Sharma on India vs Sri Lanka: మల్టీ నేషన్ టోర్నీల్లో భారత్ ఇబ్బంది పడుతుందా?.. రోహిత్ ఆసక్తికర సమాధానం
07 September 2022, 8:57 IST
- Rohit about India vs Sri Lanka: మల్టీ నేషన్ టోర్నీల్లో భారత్ ఇబ్బంది పడుతుందా అనే ప్రశ్నకు టీమిండియా రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అలాంటిదేమి లేదని స్పష్టం చేశాడు. గతంలోనూ భారత్ సెమీస్, ఫైనల్, ఫైనల్కు చేరుకున్నట్లు గుర్తు చేశాడు.
రోహిత్ శర్మ
Rohit about India vs Sri Lanka: టీమిండియా గత కొంతకాలంగా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ల్లో విజయం సాధిస్తున్నప్పటికీ పెద్ద టోర్నీల్లో మాత్రం విఫలమవుతోంది. 2019 ప్రపంచకప్ దగ్గర నుంచి చూసుకుంటే గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. తాజాగా ఆసియా కప్ ఇలా వరుసగా మల్టీ నేషన్ టోర్నమెంట్లలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వేలపై ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తా చాటిన భారత్.. ఆసియా కప్లో వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకోని ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
"మల్టీ నేషన్ టోర్నమెంట్లలో టీమిండియా విఫలమవుతోందని నేను అనుకోవడం లేదు. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఎక్కడో గాడి తప్పుతోంది. మల్టీ నేషన్ టోర్నమెంట్లో వచ్చేసరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే ద్వైపాక్షిక సిరీస్ల్లో 3 నుంచి 5 మ్యాచ్లు ఒకే ఒక ప్రత్యర్థితో ఆడతాం. కాబట్టి వారి మైండ్ సెట్, బలాలు, బలహీనతలు సులభంగా అర్థమవుతాయి. కానీ వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల వద్దకు వచ్చేసరికి విభిన్న జట్లతో సవాళ్లు ఎదురవుతున్నాయి." అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఒత్తిడి పరిస్థితుల్లో మెరుగైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేదే తాము ఆలోచిస్తామని హిట్ మ్యాన్ అన్నాడు.
"మేము మా డ్రెస్సింగ్ రూంలో ఈ వైఫల్యం గురించి మాట్లాడం. దురదృష్టవశాత్తు.. గతేడాది టీ20 ప్రపంచకప్లో సెమీస్కు కూడా వెళ్లలేకపోయాం. ఆసియా కప్లో రెండు మ్యాచ్ల్లో మేము ఓడిపోయాం. కానీ ఇది మాకు సవాలు. ఐసీసీ టోర్నీల్లో చరిత్రను చూస్తే సెమీ ఫైనల్, ఫైనల్, ఫైనల్లో కూడా మేము గెలిచాం. ఒత్తిడి పరిస్థితుల్లో మెరుగైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఆటగాళ్లకు సాయం చేయడమే మా పని" అంటూ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. గత రెండు మ్యాచ్ల్లో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనపై అతడు స్పందించాడు.
"భువి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అతడు చాలా ఏళ్లుగా ఆడుతున్నాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసి ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ఒకటి, రెండింటిల్లో పరాజయం పాలైనంత మాత్రాన అతడి ప్రతిభను తక్కువ చేయడానికి లేదు" అంటూ రోహిత్ శర్మ.. భువికి మద్దతుగా మాట్లాడాడు.
మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక.. టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండిస్(57), పాథుమ్ నిశాంక(52) అర్ధశతకాలతో అదరగొట్టాగా.. కెప్టెన్ శనక(33) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విఫమైన వేళ.. రోహిత్ శర్మ(72) అర్ధశతకంతో రాణించాడు.