Rohit Sharma: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్!
21 June 2022, 15:22 IST
- ఇంగ్లండ్తో జరగబోయే ఏకైక టెస్ట్ కోసం రోహిత్ శర్మ ఈ మధ్యే లండన్లో ల్యాండవగా.. విరాట్ కోహ్లి ఈ నెల 16నే అక్కడికి వెళ్లాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
లండన్ లో షాపింగ్ చేస్తూ అభిమానితో ఫొటో దిగిన రోహిత్ శర్మ
లండన్: ఇంగ్లండ్తో వచ్చే నెల 1 నుంచి కీలకమైన ఐదో టెస్ట్ జరగబోతోంది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో ఇండియన్ టీమ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ గెలవాలంటే ఈ టెస్ట్ను కనీసం డ్రా అయినా చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ ఉన్న ఫామ్ చూస్తే అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు. ఈ మధ్యే వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్ను 2-0తో చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలో ఆ టీమ్ చెలరేగుతోంది.
మరోవైపు ఇప్పటికే కొవిడ్ బారిన పడిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. సోమవారం లండన్ ఫ్లైట్ మిస్సయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలు షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో తిరుగుతూ, ఫ్యాన్స్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు వైరల్గా మారాయి. దీంతో ఈ విషయంపై బీసీసీఐ కాస్త గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే ఈ ఇద్దరితోపాటు టీమ్ మొత్తానికి కొవిడ్ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఇన్సైడ్స్పోర్ట్తో ఆయన మాట్లాడుతూ.. "యూకేలో కొవిడ్ ముప్పు కాస్త తగ్గింది. అయినా సరే ప్లేయర్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. టీమ్ జాగ్రత్తగా ఉండాలని మేము చెబుతాం" అని అరుణ్ ధుమాల్ అన్నారు.
యూకేలో ఇండియాలో వస్తున్న స్థాయిలోనే రోజుకు 10 వేల కేసుల వరకూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయర్స్ బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలన్న ఆదేశాలు బీసీసీఐ జారీ చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయర్స్ ఎవరికైనా కొవిడ్ సోకితే.. ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది. ఇది వాళ్లను మ్యాచ్కు దూరం చేసే ప్రమాదం ఉంది.
ఈ మ్యాచ్కు ముందు లీసెస్టర్ షైర్తో టీమిండియా నాలుగు రోజుల వామప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ నెల 24 నుంచి 27 వరకూ ఆ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే కోచ్ ద్రవిడ్ సహా ప్లేయర్స్ అంతా యూకే వెళ్లారు. అశ్విన్ మాత్రమే కొవిడ్ వల్ల మిస్సయ్యాడు. ఐదో టెస్ట్ సమయానికి అతను పూర్తిగా కోలుకొని మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.