Ranji Trophy match restarted: 4 సెషన్లలో 24 వికెట్లు.. పిచ్ డేంజర్గా ఉందంటూ మరో పిచ్పై మ్యాచ్ రీస్టార్ట్
21 December 2022, 20:47 IST
- Ranji Trophy match restarted: 4 సెషన్లలో 24 వికెట్లు పడిపోయాయి. దీంతో పిచ్ డేంజర్గా ఉందంటూ మరో పిచ్పై మ్యాచ్ను రీస్టార్ట్ చేశారు. రంజీ ట్రోఫీలో పంజాబ్, రైల్వేస్ మధ్య మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.
కర్నైల్ సింగ్ స్టేడియం (ఫైల్ ఫొటో)
Ranji Trophy match restarted: రంజీ ట్రోఫీలో రెండు రోజుల పాటు ఓ మ్యాచ్ జరిగిన తర్వాత పిచ్ ప్రమాదకరంగా ఉందంటూ రద్దు చేసి మళ్లీ ఫ్రెష్గా ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించడం విశేషం. గ్రూప్ డీలో పంజాబ్, రైల్వేస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమైంది. అయితే మంగళవారం మూడు సెషన్లు, బుధవారం తొలి సెషన్ కలిపి మొత్తం 24 వికెట్లు పడిపోయాయి.
రెండో ఇన్నింగ్స్లో పంజాబ్ 18 రన్స్కే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో మ్యాచ్ అధికారులంతా చర్చించుకొని రద్దు చేయాలని నిర్ణయించారు. పిచ్ ప్రమాదకరంగా, అసలు ఆటకు పనికి రాని విధంగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గురువారం మరోసారి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ నుంచే మళ్లీ మొదలు కానుండగా.. రెండు టీమ్స్ తమ తుదిజట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారు. అయితే రెండు రోజుల పాటే మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 162 రన్స్కే కుప్పకూలింది. ఆ తర్వాత రైల్వేస్ టీమ్ 150 రన్స్ మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లో పంజాబ్ 18 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో మ్యాచ్ను రద్దు చేశారు. ఒక రకంగా ఈ మ్యాచ్లో రైల్వేస్కు గెలిచే అవకాశం ఉండేది.
కర్నైల్ సింగ్ స్టేడియంలోని పిచ్లో బౌన్స్ అనూహ్యంగా ఉంది. దీని కారణంగా బ్యాటర్లకు గాయాలు కూడా అయ్యాయి. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉంది. దీంతో రెండు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ మ్యాచ్ను రద్దు చేయడంపై రైల్వేస్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ రద్దు నిర్ణయం తీసుకునే ముందు రెండు టీమ్స్ కెప్టెన్లతో అధికారులు మాట్లాడారు.
అయితే పిచ్ను రిపేర్ చేసి మ్యాచ్ను కొనసాగించి ఉండవచ్చని ఓ రైల్వేస్ టీమ్ అధికారి చెప్పినట్లు పీటీఐ రిపోర్ట్ వెల్లడించింది. తాము గెలిచే స్థితిలో ఉన్నామని, ఈ నిర్ణయం కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయినట్లు అయిందని ఆ అధికారి అన్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది.
నిజానికి కర్నైల్ స్టేడియం పిచ్పై గతంలోనూ విమర్శలు వచ్చాయి. 2012లో ఒకసారి క్యూరేటర్లు కావాలని హోమ్ టీమ్ రైల్వేస్ స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్ను మార్చారన్న ఆరోపణలపై రెండేళ్లపాటు ఈ స్టేడియంపై బీసీసీఐ నిషేధం విధించింది. సౌరాష్ట్రతో జరిగిన ఆ మ్యాచ్లో ఒకే రోజు 18 వికెట్లు నేలకూలాయి.