Pakistan Hockey Team: వాఘా సరిహద్దు నుంచి ఇండియాలో అడుగుపెట్టిన పాకిస్థాన్ టీమ్
01 August 2023, 18:34 IST
- Pakistan Hockey Team: వాఘా సరిహద్దు నుంచి ఇండియాలో అడుగుపెట్టింది పాకిస్థాన్ హాకీ టీమ్. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ టీమ్ ఇండియాకు రావడం విశేషం.
వాఘా సరిహద్దు ద్వారా ఇండియాలో అడుగుపెట్టిన పాకిస్థాన్ హాకీ టీమ్
Pakistan Hockey Team: పాకిస్థాన్ హాకీ టీమ్ ఇండియాకు వచ్చింది. గురువారం (ఆగస్ట్ 3) నుంచి చెన్నైలో ప్రారంభం కానున్న ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దాయాది టీమ్ మన దేశంలో అడుగుపెట్టింది. పంజాబ్ లోని వాఘా సరిహద్దు ద్వారా వాళ్లు ఇండియాలోకి రావడం విశేషం. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆగస్ట్ 9న మ్యాచ్ జరగనుంది.
సరిహద్దు నుంచి అమృత్సర్ వరకు రోడ్డు మార్గంలో వచ్చి.. అక్కడి నుంచి మంగళవారం (ఆగస్ట్ 1) రాత్రి చెన్నైకి విమానంలో బయలుదేరనుంది. మరోవైపు ఇండియన్ హాకీ టీమ్ కూడా మంగళవారం ఉదయమే చెన్నైలో అడుగుపెట్టింది. హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని టీమ్ స్వదేశంలో ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.
ఈ టోర్నమెంట్ కోసం ఇండియన్ టీమ్ ఎగ్మోర్ లోని మేయర్ రాధకృష్ణన్ హాకీ స్టేడియంలోప్రాక్టీస్ చేయనుంది. ఇదే స్టేడియంలో గురువారం జరగబోయే తొలి మ్యాచ్ లో చైనాతో తలపడనుంది. బుధవారం పాకిస్థాన్ టీమ్ కూడా ఇదే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. 2010లో తొలిసారి వుమెన్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేసిన ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది.
ఆ తర్వాత 2011లో ఆరు టాప్ మెన్స్ టీమ్స్ తో ఈ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. 2013 వరకూ ప్రతి ఏటా ఈ టోర్నీ జరిగింది. 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి జరుగుతోంది. 2020లో జరగాల్సిన టోర్నీ కొవిడ్ కారణంగా 2021కి వాయిదా పడింది. దీంతో రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ట్రోఫీ జరగనుంది.
ఈ టోర్నీని ఇప్పటివరకూ ఇండియా, పాకిస్థాన్ జట్లు మూడేసిసార్లు గెలవగా.. 2018లో ఈ రెండు జట్లే పంచుకున్నాయి. ఇక 2021లో సౌత్ కొరియా తొలిసారి ట్రోఫీ గెలిచి ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా అడుగుపెట్టబోతోంది. ఆ ఏడాది జపాన్ పై గెలిచి సౌత్ కొరియా ట్రోఫీ గెలిచింది.