Neeraj Chopra Autograph: అక్కడ ఆటోగ్రాఫ్ కోరిన మహిళా ఫ్యాన్.. నీరజ్ చోప్రా ఏం చేశాడంటే?
29 August 2023, 12:01 IST
Neeraj Chopra Sign: ఇండియన్ జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు మరోసారి భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. భారత జెండాపై ఆటోగ్రాఫ్ అడిగిన హంగేరియన్ యువతి పట్ల నీరజ్ చోప్రా ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్
Neeraj Chopra Autograph To Hungarian Lady: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (World Athletics Championships) స్వర్ణం సాధించి కోట్లాది భారతీయుల మనసు గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా (Neeraj Chopra). ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో తన జావెలిన్ త్రోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నీరజ్. ఇదే టోర్నమెంట్లో గతేడాది రజతంతో సరిపెట్టుకున్న ఈ యువ ఆటగాడు ఈసారి మాత్రం పసిడిని ముద్దాడాడు. గోల్డ్ మెడల్ సాధించి తన కల నెరవేర్చుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో 88.17 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో చేసి స్వర్ణ పతకం అందుకున్నాడు.
ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో నీరజ్ స్వర్ణం గెలవగా.. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు. చెక్కు చెందిన వద్లెచ్ 86.67 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో కాంస్య పతకం దక్కించుకున్నాడు. నీరజ్ చోప్రా పసిడితో మొత్తంగా ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్కు మూడోసారి పతకం వరించినట్లయింది. అంతేకాకుండా తొలిసారిగా ఇండియాకు గెల్డ్ మెడల్ వచ్చింది.
నీరజ్ చోప్రా ఇండియాకు పసిడి పతకం తేవడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తన ఆటతోనే కాకుండా ప్రవర్తనతో కూడా మరోసారి నీరజ్ చోప్రా ప్రశంసలు కురిసేలా చేశాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ టోర్ని ముగిసిన తర్వాత నీరజ్ చోప్రాను ఒక హంగేరియన్ మహిళా (Hungarian Lady) అభిమాని వచ్చి భారత జాతీయ జెండాపై (Indian National Flag) తన ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది. దాన్ని సున్నితంగా తిరస్కరించిన నీరజ్ చోప్రా "మా జాతీయ జెండాపై (Flag of India) ఆటోగ్రాఫ్ ఇవ్వడం అంటే మా దేశ నిబంధనలు అతిక్రమించడం అవుతుంది. దానికి బదులుగా మీ టీషర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తాను" అని సంతకం చేశాడు.
ఈ విషయాన్ని జొనాథన్ సెల్వరాజ్ అనే నెటిజన్ ట్వీట్లో పేర్కొన్నాడు. "హిందీ బాగా మాట్లాడే ఓ స్వీట్ హంగేరియన్ యువతి నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరింది. దానికి నీరజ్ ఒప్పుకున్నాడు. కానీ, ఆమె భారత జాతీయ పతాకంపై ఇవ్వాల్సిందిగా కోరింది. లేదు. అక్కడ సంతకం చేయలేను. మీ టీషర్ట్ స్లీవ్పై ఇస్తాను అని నీరజ్ చోప్రా సంతకం చేశాడు. దానికి ఆమె తెగ సంతోషపడిపోయింది" అని రాసుకొచ్చాడు జొనాథన్. ఈ ట్వీట్ వైరల్ కాగా 'ఇదే కదా అసలైన దేశభక్తి', 'నీకు మన దేశం పట్ల ఉన్న గౌరవానికి హ్యాట్సాఫ్' అంటూ నెటిజన్లు నీరజ్ చోప్రాను ప్రశంసిస్తున్నారు.
కాగా ఫ్లాగ్ ఆఫ్ కోడ్ ఇండియా 2002 (Flag Code Of India 2002) ప్రకారం భారత జాతీయ జెండాపై ఎలాంటి అక్షరాలు రాయడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది పారిస్ ఒలంపిక్స్ లో నీరజ్ పాల్గొంటున్నట్లు తెలిపాడు. "ఒలంపిక్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. వరల్డ్ ఛాంపియన్స్ గొప్ప కీర్తి తీసుకొస్తాయి. మీరు పోటీ గురించి మాట్లాడితే.. ఒలంపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్స్ చాలా కష్టమైనవి. ప్రతి ఒక్క అథ్లేట్ వాటికి సంసిద్ధం అయ్యే పాల్గొంటారు" అని నీరజ్ పేర్కొన్నాడు.