India vs Zimbabwe T20 World Cup: రాహుల్, సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్ - జింబాబ్వే టార్గెట్ 187
06 November 2022, 15:26 IST
India vs Zimbabwe T20 World Cup: ఆదివారం జింబాబ్వేతో జరుగుతోన్న చివరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్లో టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కె.ఎల్ రాహుల్తో పాటు సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్తో మెరవడంతో ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది.
కె.ఎల్ రాహుల్
India vs Zimbabwe T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వేతో జరుగుతోన్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో 186 పరుగులు భారీ స్కోరు సాధించింది. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో ఓపెనర్ కె.ఎల్ రాహుల్ మెరిశాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ రాణించడంతో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నగర్వా వేసిన తొలి ఓవర్లో రాహుల్ ఒక్క పరుగు కూడా చేయలేదు. పదో బాల్కు ఇండియా పరుగులు ఖాతా తెరిచింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రాహుల్ ఆ తర్వాత జోరు పెంచాడు.
మరోసారి పేలవ ఫామ్ కొనసాగించిన కెప్టెన్ రోహిత్ 13 బాల్స్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్, విరాట్ కలిసి టీమ్ ఇండియా స్కోరును పరుగులు పెట్టించారు. 25 బాల్స్లో 26 రన్స్ చేసి విరాట్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ పెవిలియన్ చేరాడు.
35 బాల్స్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 51 రన్స్ చేశాడు. కార్తిక్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చివరలో సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో టీమ్ ఇండియా 186 రన్స్ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో సూర్యకుమార్ రెచ్చిపోయాడు. 23 బాల్స్లోనే 3 సిక్సర్లు, ఐదు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. 25 బాల్స్లో 61 రన్స్తో సూర్యకుమార్ నాటౌట్గా మిగిలాడు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు.