India vs Bangladesh 2nd ODI: చేతులెత్తేసిన ఇండియన్ బౌలర్లు.. మెహదీ సెంచరీతో బంగ్లా భారీ స్కోరు
07 December 2022, 16:15 IST
- India vs Bangladesh 2nd ODI: ఇండియన్ బౌలర్లు మరోసారి చేతులెత్తేసిన వేళ.. మెహదీ హసన్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఒక దశలో 100 స్కోరైనా దాటుతుందా అనుకున్న బంగ్లాదేశ్ రెండో వన్డేలో భారీ స్కోరు చేసింది.
బంగ్లాదేశ్ బ్యాటర్ మెహదీ హసన్
India vs Bangladesh 2nd ODI: ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 రన్స్ చూసింది. ఒక దశలో 69 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను మెహదీ హసన్, మహ్మదుల్లా ఆదుకున్నారు. తొలి వన్డేలో టీమ్కు అద్భుత విజయం సాధించి పెట్టిన మెహదీ హసన్ ఈ మ్యాచ్లో 83 బాల్స్లోనే సెంచరీ చేశాడు.
అంతేకాదు మహ్మదుల్లాతో కలిసి ఏడో వికెట్కు 148 రన్స్ జోడించి బంగ్లాదేశ్కు మంచి స్కోరు సాధించి పెట్టాడు. మహ్మదుల్లా 96 బాల్స్లో 77 రన్స్ చేసి ఔటయ్యాడు. మొదట్లో చెలరేగి తర్వాత చేతులెత్తేసే సంప్రదాయాన్ని ఇండియన్ బౌలర్లు ఈ మ్యాచ్లోనూ కొనసాగించారు. వాషింగ్టన్ సుందర్ 3, ఉమ్రాన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి వన్డేల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా మెహదీ హసన్ నిలిచాడు. వన్డేల్లో అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు అతడు చివర్లో చెలరేగి తన టీమ్కు చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 68 రన్స్ చేసి పెట్టాడు. దీంతో 69/6 నుంచి బంగ్లాదేశ్ 271/7కు చేరింది. తర్వాత చేజింగ్లో కెప్టెన్ రోహిత్ గాయపడటంతో ధావన్తో కలిసి కోహ్లి ఓపెనింగ్కు దిగాడు.