IND VS PAK | పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
06 March 2022, 13:20 IST
- మహిళల వరల్డ్కప్లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్లో ఒక దశలో తడబడినా.. పూజా, స్నేహ్ రాణాల అద్భుతమైన పోరాటంతో పుంజుకున్న భారత్.. తర్వాత బౌలింగ్లో పాక్కు అసలు ఛాన్సివ్వలేదు.
పాకిస్థాన్ మహిళల టీమ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మౌంట్ మాంగనూయి: వుమెన్స్ వరల్డ్కప్లో ఇండియన్ టీమ్ తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ను చిత్తు చేసింది. వన్డేల్లో ఆ టీమ్పై ఉన్న తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ.. సులువుగా గెలిచింది. 245 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 107 పరుగులతో గెలిచి వరల్డ్కప్లో శుభారంభం చేసింది. పూజా వస్త్రాకర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది.
భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లతో రాణించింది. ఝులన్ గోస్వామి,స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీసుకున్నారు. మేఘనా, దీప్తి చెరొక వికెట్ తీశారు. ఒక దశలో వికెట్ నష్టానికి 53 పరుగులతో పర్వాలేదనిపించిన పాకిస్థాన్.. 17 పరుగుల తేడాలో కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు చేజార్చుకుంది. 70 పరుగులకే సగం మంది బ్యాటర్లు ఔటవడంతో పాక్ కోలుకోలేకపోయింది.
పూజా, స్నేహ్.. అద్భుతమైన పోరాటం
మొదట్లో స్మృతి మంధాన(52), దీప్తి శర్మ (40).. తర్వాత పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా పోరాటంతో అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఒక దశలో పాక్ స్పిన్నర్ల ధాటికి 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా అద్భుతంగా పోరాడారు.
పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూజా వస్త్రాకర్ 59 బంతుల్లోనే 67 పరుగులు చేసింది. 8 ఫోర్లు బాదడంతోపాటు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ ఆమె పాకిస్థాన్ టీమ్ను డిఫెన్స్లో పడేసింది. ఆమెకు స్నేహ్ రాణా అద్భుతమైన సహకారం అందించింది. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్కు 122 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో పూజా ఔటవడంతో ఈ ఇద్దరి పార్ట్నర్షిప్కు తెరపడింది. స్నేహ్ రాణా 48 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
అంతకుముందు భారత్కు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ డకౌటైంది. దీంతో 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ స్మృతి మంధాన, దీప్తి శర్మ పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 92 రన్స్ జోడించారు. ఈ సమయంలో మొదట దీప్తి శర్మ 40 పరుగులు చేసి ఔటవడంతో భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది. స్మృతి మంధాన (52), హర్మన్ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1), మిథాలీ రాజ్ (9) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కనీసం 150 స్కోరైనా సాధ్యమేనా అనిపించింది. అయితే స్నేహ్, పూజా అసాధారణ పోరాటంతో టీమ్ మంచి స్కోరు సాధించగలిగింది.