Rishabh Pant: సరైన పరిస్థితుల్లో రాలేదు కానీ.. కెప్టెన్సీపై పంత్ రియాక్షన్ ఇదీ
08 June 2022, 20:30 IST
- టీమిండియాకు తొలిసారి కెప్టెన్ అయ్యాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సౌతాఫ్రికాతో సిరీస్కు కేఎల్ రాహుల్ గాయపడటంతో అనుకోకుండా ఈ అవకాశం పంత్ను వరించింది.
టీమిండియా స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో సిరీస్కు ఒక రోజు ముందు గాయం కారణంగా స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో అనుకోకుండా ఈ కెప్టెన్సీ వైస్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్కు దక్కింది. ఇప్పుడతను తొలిసారి ఇండియాను తన సొంత గ్రౌండ్లో లీడ్ చేయబోతున్నాడు. బుధవారం సాయంత్రం ప్రాక్టీస్ సెషన్లో ఉండగా తనకు కెప్టెన్సీ ఇచ్చిన విషయం పంత్కు తెలిసింది.
అసలు తాను కెప్టెన్ అన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని పంత్ చెప్పడం విశేషం. "ఇంకా ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. గంట కిందటే నాకు తెలిసింది" అని పంత్ నవ్వుతూ చెప్పాడు. "ఇది చాలా మంచి ఫీలింగ్. కెప్టెన్సీ సరైన పరిస్థితుల్లో నాకు దక్కలేదు. కానీ అదే సమయంలో నేను హ్యాపీగానే ఉన్నాను. ఇండియన్ టీమ్ను లీడ్ చేసే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బీసీసీఐకి థ్యాంక్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా క్రికెట్ కెరీర్లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. ప్రతి రోజూ నా జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను" అని పంత్ అన్నాడు.
పంత్కు టీమిండియాను లీడ్ చేయడం ఇదే తొలిసారి అయినా.. ఐపీఎల్లో రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా ఉన్నాడు. రంజీ ట్రోఫీలోనూ ఢిల్లీ టీమ్కు సారథ్యం వహించాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం ఇప్పుడు తనకు ఉపయోగపడనుందని చెప్పాడు. "ఓ కెప్టెన్గా అది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఒక పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటే మీరు మెరగవుతారు. నేను తప్పుల నుంచి నేర్చుకుంటాను. ఇది రానున్న రోజుల్లో నాకు తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని పంత్ చెప్పాడు.
రానున్న వరల్డ్కప్ లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని, రానున్న రోజుల్లో మార్పులు తథ్యమని, తాము ఆడే విధానం కూడా మారుతుందని అనుకుంటున్నట్లు పంత్ తెలిపాడు. గురువారం నుంచి సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు రాహుల్తోపాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా దూరమయ్యాడు.