RR vs GT | రాజస్థాన్పై గుజరాత్ విజయం.. అగ్రస్థానానికి హార్దిక్ సేన
14 April 2022, 23:39 IST
- ముంబయి వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటర్ జాస్ బట్లర్ ఒక్కడే అర్ధశతకంతో విజృంభించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
హార్దిక్ పాండ్య
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ 23వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జాస గుజరాత్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించలేకపోయింది. జాస్ బట్లర్(54) మినహా మిగిలిన వారంత విఫలమైన వేళ.. రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. చివర్లో హిట్మైర్(29) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ విజయం మాత్రం వరించలేదు. గుజరాత్ బౌలర్లలో లోకీ ఫెర్గ్యూసన్, యశ్ దయాల్ చెరో 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
193 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్ జాస్ బట్లర్ ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించాడు. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఘనమైన ఆరంభాన్ని అందించాడు. అయితే మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ తను ఫేస్ చేసిన మొదటి బంతికే డకౌట్గా వెనుదరిగాడు. సహచర బ్యాటర్ పెవిలియన్ చేరినప్పటికీ బట్లర్ దూకుడు మాత్రం తగ్గలేదు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లతో విజృంభించాడు. ఇదే సమయంలో తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(8) కూడా ఫెర్గ్యూసన్ బౌలింగ్లోనే మిల్లర్కు క్యాచ్ ఇచ్చాడు. ఇంక అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభమైంది. కాస్త వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ ప్రత్యర్థి బౌలర్లపై బట్లర్ ఎదురుదాడి మాత్రం తగ్గలేదు.
ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు బట్లర్. 24 బంతుల్లో 54 పరుగులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కానీ ఫెర్గ్యూసన్ బౌలింగ్ బట్లర్ కూడా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ నుంచి మ్యాచ్ చిన్నగా చేజారిపోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ను(11) కూడా హార్దిక్ రనౌట్ చేయడంతో రాజస్థాన్ మరింత కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన డసెన్(6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడ లేకపోయాడు.
ఈ మధ్య కాలంలో ఫామ్లేమితో సతమతమవుతున్న షిమ్రన్ హిట్మైర్(29) చివర్లో కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ.. అవి మ్యాచ్ నెగ్గేందుకు పెద్దగా సహాయ పడలేదు. బ్యాట్ ఝుళిపిస్తున్న అతడిని షమీ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన జేమ్స్ నీషమ్(17), రియాన్ పరాగ్(18) కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(87) అర్ధశతకంతో కదం తొక్కగా.. మరో బ్యాటర్ అభినవ్ మనోహర్(43) ఆకట్టుకున్నాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(31) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాపిక్