England vs India: ఇండియాతో ఆడబోయే తుదిజట్టును ప్రకటించిన ఇంగ్లండ్
30 June 2022, 16:44 IST
- England vs India: ఇండియాతో చివరి టెస్ట్ ఆడబోయే ఇంగ్లండ్ టీమ్ను ప్రకటించింది అక్కడి క్రికెట్ బోర్డు. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే తుది జట్టు ఏదో తెలిసిపోయింది.
ఇండియాతో చివరి టెస్ట్ కు ఇంగ్లండ్ టీమ్ రెడీ
బర్మింగ్హామ్: ఓవైపు ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడో లేదో తెలియని అయోమయంలో ఉంటే మరోవైపు ఇంగ్లండ్ మాత్రం తమ తుది జట్టునే ప్రకటించేసింది. ఈ టీమ్ను ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. న్యూజిలాండ్తో ఆడిన మూడో టెస్ట్లోని టీమ్లో రెండు మార్పులు చేసింది. సీనియర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి రాగా.. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ వచ్చాడు.
మిగిలిన టీమ్ అంతా అలాగే ఉంది. న్యూజిలాండ్తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 97 రన్స్ చేసిన జేమీ ఓవర్టన్ స్థానంలో జేమ్స్ ఆండర్సన్ను తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ సీనియర్ మోస్ట్ బౌలర్లు ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మరోసారి కలిసి బౌలింగ్ చేయనున్నారు. ఇక బ్యాటింగ్లో అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ ఉన్నారు. తుది జట్టులో ఇంగ్లండ్ ఒకే స్పిన్నర్ (జాక్ లీచ్)కు చోటిచ్చింది.
ఇంగ్లండ్ తుది జట్టు ఇదీ: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్