Virat Kohli Fake fielding: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్.. అందుకే ఓడిపోయాం.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ఆరోపణలు
03 November 2022, 16:04 IST
- Virat Kohli Fake fielding: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురువారం నాటి మ్యాచ్లో ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లాదేశ్కు వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విరాట్ కోహ్లీ
Virat Kohli Fake fielding: బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్లో ఆకట్టుకున్న భారత్.. అనంతరం బౌలింగ్లో తడబడింది. ఆరంభంలో పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు తర్వాత పుంజుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశారు. ఫలితంగా బంగ్లాపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరోసారి అర్థశతకం సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్లో తన మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నురుల్ హసన్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపించాడు.
"కచ్చితంగా వర్షం ప్రభావం మా మ్యాచ్పై పడింది. కానీ విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల మేము ఐదు పరుగులు కోల్పోయాం. అంపైర్లు క్రిస్ బ్రౌన్, మారియస్ ఎరాస్మస్ కూడా ఈ ఘటనను చూడలేకపోయారు." అని నురుల్ హసన్ స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ ఘటన ఏడో ఓవర్లో జరిగిందని నురుల్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. అర్ష్దీప్ సింగ్ సింగ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్కు విసిరేయగా.. విరాట్ కోహ్లీ బంతిని స్ట్రైకర్ ఎండ్లో త్రో చేస్తున్నట్లు ఫేక్ ఫీల్డింగ్ చేశాడు. అయితే ఇది ఫేక్ ఫీల్డింగ్ కాదంటూ నెటిజన్లు నరుల్పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పరుగులు తీస్తున్న లిటన్ దాస్-నజ్ముల్ హుస్సేన్ బ్యాటర్లు ఇద్దరూ కోహ్లీ వైపు చూడలేదు. అందుకే నురుల్ వాదనపై కౌంటర్ వేస్తున్నారు.
ఫేక్ ఫీల్డింగ్ అంటే..
ఐసీసీ ప్లేయింగ్ కండీషన్స్ రూల్ 41.5 ప్రకారం ఉద్దేశపూర్వకంగా, పరధ్యానంగా(Distraction), మోసగించడం లేదా బ్యాటర్ను అడ్డుకోవడం.. ఫేక్ ఫీల్డింగ్ కిందకు వస్తుంది. ఎవరైన ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫేక్ ఫీల్డింగ్ ప్రకారం ఫెనల్టీ పరుగులు ఇవ్వవచ్చు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అని నురుల్ ఆరోపిస్తుండగా.. ఐసీసీ రూల్లో పేర్కొన్న డిస్ట్రాక్షన్, మోసం పదాలను అతడు పరిగణించలేదు. శాంటో లేదా లిటన్ దాస్ ఎవరూ కూడా అతడి ప్రవర్తన వల్ల మోసపోలేదు. అందుకే నురుల్ ఆరోపణను అంపైర్లు పరిగణించలేదు. ఇందుకు విరుద్ధంగా నురుల్ మ్యాచ్ అధికారులను విమర్శించినందుకు అతడిపై చర్య తీసుకునే అవకాశముంది.
ఈ మ్యాచ్లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లలో బంగ్లా 151 పరుగులను ఛేదించాల్సి ఉండగా.. 145 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో దూకుడుగా ఆడిన బంగ్లా జట్టు.. అనంతరం పదే పదే వికెట్లు కోల్పయి ఓటమి ముంగిట నిలిచింది.