IPL Media Rights: అమెజాన్ ఔట్.. ఇక రేసు ఆ నలుగురి మధ్యే
11 June 2022, 16:26 IST
- ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ-వేలం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వేలం ద్వారా బీసీసీఐపై సుమారు రూ.50 వేల కోట్ల కాసుల వర్షం కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లేయర్స్ వేలం కంటే మీడియా హక్కుల వేలం ఈసారి ఎక్కువ ఆసక్తి రేపుతోంది. ఈసారి ఈ హక్కుల మొత్తం అన్ని రికార్డులను బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ రేసులో ఎంతో ఆసక్తి రేపిన జెఫ్ బెజోస్ vs ముకేశ్ అంబానీ ఫైట్ ఈసారి లేనట్లే. ఈ వేలం నుంచి తప్పుకుంటున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
అమెజాన్ తప్పుకోవడంతో ఈ మీడియా హక్కులు అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని వయాకామ్18కే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీవీ, డిజిటల్ హక్కులు రెండూ దక్కించుకోవడానికి వయాకామ్ 18 ప్రయత్నిస్తోంది. ఈ రేసులో ముఖ్యంగా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ గట్టిగానే ప్రయత్నిస్తుందని అంతా భావించారు.
కానీ వేలానికి రెండు రోజుల ముందు తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. "అవును అమెజాన్ రేసు నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టెక్నికల్ బిడ్డింగ్ ప్రాసెస్లో వాళ్లు పాల్గొనలేదు. ఇక గూగుల్ (యూట్యూబ్) విషయానికి వస్తే.. వాళ్లు బిడ్ డాక్యుమెంట్ తీసుకున్నా దాన్ని తిరిగి సబ్మిట్ చేయలేదు. ప్రస్తుతానికి పది కంపెనీలు పోటీలో ఉన్నాయి" అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.
2023 నుంచి 2027 వరకూ ఐదు ఐపీఎల్ సీజన్ల కోసం మీడియా హక్కుల వేలం నిర్వహించనున్నారు. ఒక్కో సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. అయితే చివరి రెండు సీజన్లలో వీటి సంఖ్యను 94కు పెంచనున్నట్లు ఓ ప్రొవిజన్ను ఇందులో చేర్చారు. ఇండియన్ సబ్కాంటినెంట్ టీవీ, డిజిటల్.. ఓవర్సీస్ టీవీ, డిజిటల్తోపాటు ప్రతి సీజన్లో ప్రత్యేకంగా 18 ఎంపిక చేసిన మ్యాచ్ల డిజిటల్ హక్కుల కోసం వేలం నిర్వహిస్తారు.
అయితే అమెజాన్ తప్పుకోవడంతో ఇక రేసులో మిగిలిన వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ (స్టార్), జీ, సోనీ మధ్య పోటీ నెలకొంది. ఈ హక్కుల కోసం ఈ నలుగురూ తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. 2017 నుంచి 2022 వరకూ స్టార్ ఈ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పుడు వీటి కోసం రూ.16,347 కోట్లు వెచ్చించగా.. ఈసారి అన్నీ కలిపి బేస్ప్రైసే రూ.32 వేల కోట్లు ఉండటంతో.. రూ.45 వేల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ పలికే ఛాన్స్ కనిపిస్తోంది.