Aakash Chopra on Team India: మూడో వన్డేలో ఇండియా 400 స్కోరు చేసినా ఆశ్చర్యం లేదు: ఆకాశ్ చోప్రా
24 January 2023, 12:11 IST
- Aakash Chopra on Team India: మూడో వన్డేలో ఇండియా 400 స్కోరు చేసినా ఆశ్చర్యం లేదని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. న్యూజిలాండ్ పై ఇప్పటికే సిరీస్ గెలిచిన ఇండియన్ టీమ్.. మంగళవారం (జనవరి 24) చివరి వన్డేకు సిద్ధమైంది.
ఇండోర్ పిచ్ పరిశీలిస్తున్న ఇండియన్ టీమ్ ప్లేయర్స్
Aakash Chopra on Team India: న్యూజిలాండ్ తో ఇండియా ఆడబోయే మూడో వన్డేపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో మూడో వన్డే మరింత స్వేచ్ఛగా ఆడి మరో క్లీన్ స్వీప్ పై కన్నేసింది. అయితే ఇండోర్ లో జరగబోయే ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే 400 స్కోరు చేసినా పెద్దగా ఆశ్చర్యం లేదని చోప్రా అనడం విశేషం.
హైదరాబాద్, రాయ్పూర్ లలో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇండియా గెలిచి 2-0 ఆధిక్యం సంపాదించింది. ఇక ఇప్పుడు బ్యాటింగ్ కు అనుకూలించే ఇండోర్ పిచ్ పై మూడో మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడాడు.
"ఈ మ్యాచ్ నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఇప్పటికే ఇండియన్ టీమ్ అంచనాలకు తగినట్లు ఆడింది. ఒకవేళ ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే 400 స్కోరు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ జరిగిన టీ20ల్లోనే 200-225 రన్స్ నమోదయ్యాయి. ప్రత్యర్థి బలహీనంగా ఉంది. పిచ్ పూర్తి ఫ్లాట్ గా ఉంది. గ్రౌండ్ చిన్నగా ఉంది. ఇలాంటి అవకాశం వస్తే అందరు బ్యాటర్లు తమ రికార్డులు మెరుగుపరుచుకుంటారు. ఎందుకంటే ఇదో అంతర్జాతీయ మ్యాచ్" అని చోప్రా అన్నాడు.
"ఇది ఎలాగూ ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్. న్యూజిలాండ్ పరువు కోసం ఆడుతోంది. ఇండియా మరింత మెరుగవ్వడం కోసం. ఇలాంటి సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ చిన్నగా ఉండటంతో చేజింగ్ చేయాలని కూడా టీమ్స్ భావించవచ్చు" అని చోప్రా చెప్పాడు.
"ప్రస్తుతం పెద్దగా ఆందోళన కలిగించేది ఏదీ లేదు. లోయర్ మిడిలార్డర్ ను ఎలా ఔట్ చేస్తామన్న భావన తొలి వన్డే తర్వాత కలిగింది. శ్రీలంక తరఫున శనక, న్యూజిలాండ్ తరఫున బ్రేస్వెల్ సెంచరీలు చేశారు. టెయిలెండర్లను ఔట్ చేయలేకపోవడమే సమస్య. కొన్నిసార్లు ఇదే కొంప ముంచుతుంది. కానీ ఇప్పుడా సమస్య కూడా లేదు. ఓ టీమ్ ను 110 లోపు కట్టడి చేస్తే పని చాలా సులువు అవుతుంది" అని చోప్రా అన్నాడు.