Poli Swargam Story: కార్తీక అమావాస్య పోలి స్వర్గం నోము కథ
11 December 2023, 20:07 IST
- Poli Swargam Story: కార్తీక అమావాస్యను పోలి అమావాస్యగా చెబుతారని ప్రముఖ అధ్యాత్యికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
విష్ణుమూర్తి
కార్తీక అమావాస్యను పోలి అమావాస్యగా చెబుతారని ప్రముఖ అధ్యాత్యికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పోలి స్వర్గం కథను ఆయన వివరించారు.
లేటెస్ట్ ఫోటోలు
ఒక చాకలి ముసలికి ఐదుగురు కోడళ్ళు కలరు. ఆ చాకలి ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారురూమున పెద్దకోడళ్ళు నలుగురితోపాటు నదీ స్నానము గావించి దీపము పెట్టుకొనుచుండెడిది.
నెల అంతయూ పూర్తి చేసి కార్తీక బహుళ అమావాస్య రోజున చిన్నకోడలిని ఇంటికి కాపలాగా ఉంచి పెద్దకోడళ్ళు నలుగురిని వెంటబెట్టుకొని యథాప్రకారముగా నదికి వెళ్ళెను. ఆ చిన్న కోడలి పేరు పోలి. ఆమె అత్యంత భక్తురాలు. పెద్దలయెడ గౌరవము, భక్తి కలిగి యుండెడిది.
అత్త, మిగిలిన తోడికోడళ్ళు తనమీద కనికరం చూపకుండా, ప్రతి రోజూ నదికి అట్టహాసముగా వెళ్ళి పూజలు గావించుకొని దీపాలు పెట్టుకొని వచ్చేవారు. కాని పోలి మాత్రము ఇంటివద్దనే ఉండి నూతి దగ్గరనే స్నానం చేసేది.
మజ్జిగ చిలికి కవ్వమునకు అంటిన వెన్నతో పత్తి చెట్టుకింద రాలిన పత్తి తెచ్చుకొని వత్తి చేసుకొని దీపం పెట్టుకునేది. శ్రీహరికి నమస్కరించుకునేది. ఇదే విధముగా నిత్యమూ జరుగుతుండెడిది.
కానీ అత్తగారు తిట్టునేమోననే భయముతో ఆ దీపము మీద చాకలిబాన బోర్లించెడిది. శ్రీహరి ఆమె శ్రద్ధాసక్తులకు ప్రసన్నుడై, ఆమెకు పుష్పకవిమానమును పంపి బొందితో స్వర్గమునకు రప్పించుచుండిరి.
ఆ విమానంలో ఉన్న చిన్న కోడలును చూసి చుట్టుప్రక్కలవారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నదని ఆశ్చర్యపడసాగిరి. ఆ మాటలు విని అత్తగారు, తోడికోడండ్లు పైకి చూచిరి.
అదే సమయాన పోలి ఎక్కిన విమానం వారి నెత్తిమీదనుండి పోవుచుండెను. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండిరి. అది చూచి విష్ణు భగవానుడు ఈ పోలి అత్యంత శ్రద్ధాసక్తులతో నిత్యమూ జ్యోతి వెలిగించెడిది.
కానీ మీరు కల్మష హృదయముతో ఆడంబరానికి పోయి అట్టహాసముగా జ్యోతులు వెలిగించిరి. కానీ నిజమయిన శ్రద్ధాభక్తులు ఇసుమంతయినా లేవు. గావున మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు. పొండి అని త్రోసివేసెను. పోలిని మాత్రమే బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్ళిరి.
కథ లోపమైనను వ్రత లోపం ఉండరాదు. పద్ధతి తప్పిననూ ఫలము తప్పదు. దీనికి ఉద్యాపనము లేదు. కథలో చెప్పినట్లుగా నెల అంతయూ సూర్యోదయానికి ముందుగా దీపాలు వెలిగించుకుని మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు దీపాలు వెలిగించి గంగలో వదలవలెను.
నోములకు, వ్రతములకు, పూజాపునస్కారాలకు కావలసినది భక్తి శ్రద్ధలు గానీ, ఆడంబరాలు, అట్టహాసములు కాదని ప్రముఖ అధ్యాత్యికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.