భర్తకు రాఖీ కట్టిన మహిళ ఎవరో తెలుసా? శ్రావణ పూర్ణిమ విశిష్టత తెలుసుకోండి
28 August 2023, 9:30 IST
- భర్తకు రాఖీ కట్టిన మహిళ ఎవరో తెలుసా? శ్రావణ పూర్ణిమ విశిష్టత ఏంటి? వంటి ధర్మ సందేహాలకు పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన సమాధానాలు ఇవీ..
రక్షాబంధన్ వేడుకలకు సిద్ధమవుతున్న భారతావని (Photo by Indranil MUKHERJEE / AFP)
రుతువులను అనుసరించి ప్రతీ పనినీ ప్రారంభించే మన పూర్వీకులు విద్యను ప్రారంభించేందుకు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు. అదే శ్రావణ పూర్ణిమ. ఈ రోజున ద్విజులు అధ్యాయోపకర్మలు చేస్తుండేవారు. అదే నేటికి ఉపాకర్మగా మారింది. అధ్యాయోపకర్మ అంటే వేదాధ్యయన ప్రారంభం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇది ద్విజులందరికీ ఉన్నప్పటికీ నేటికాలంలో బ్రాహ్మణులే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించి ఇంట్లో హోమాలు చేస్తారు. మరునాడు ఉపాకర్మకు అనుబంధంగా 1008 మార్లు గాయత్రీమంత్ర జపం చేస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
సామవేదులు విఘ్నేశ్వర చతుర్ధి నాడు ఆయనను విద్యాధిదేవతగా భావించడం వల్ల ఉపాకర్మ జరుపుకుంటారు. ఇవి నేటికి లాంఛనప్రాయంగా మిగిలిపోయాయి. పూర్వం వేదకర్మలను ఆచరించేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో యజ్ఞోపవీతాలను నిరంతరమూ ధరించేవారు కాదు. కనుక వేదాధ్యయన ప్రారంభానికి దీక్ష పూనినప్పుడు కొత్త యజ్ఞోపవీతాలను ధరించడం ఆచారమైంది.
రక్షా బంధనం అంటే..
ఆ తర్వాత ఇదే కంకణ సూత్ర ధారణంగా మారి మిగతా కులాలవారిలో రక్షాబంధన కర్మగా ఏర్పడి ఉంటుంది. రక్షాబంధనాన్ని ఇదే రోజున చేసుకోవడం వల్ల ఈ శ్రావణ పూర్ణిమకు “రక్షాపూర్ణిమ, రాఖీ పూర్ణిమ” అనే పేర్లు ఏర్పడ్డాయి. అసలు ఈ రక్షాబంధనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు శ్రీ కృష్ణపరమాత్మను అడిగాడట. అప్పుడు కృష్ణుడు, పూర్వం దేవాసురయుద్ధం ఘోరంగా జరిగినప్పుడు, ఇంద్రుడు పరాజితుడై సహచరులతో అమరావతిలో తలదాచుకున్నాడు. దానితో దానవరాజు త్రిలోకాలను తన అధీనంలోకి తెచ్చుకోగా దేవపూజలు మూలనపడ్డాయి. పూజలు లేకపోవడంతో సురపతి బలమూ సన్నగిల్లింది. అప్పుడు అమరావతిలోని ఇంద్రుని మీదకు మళ్ళీ రాక్షసులు దండెత్తి వచ్చారు.
దేవగురువైన బృహస్పతి వద్దకు శచీపతి సలహాకోసం పోగా ఆయన యుద్ధం చేయమన్నాడు. ఇంతలో ఇంద్రాణి తన భర్త అయిన సురేంద్రునికి రక్షకట్టి విజేతవు కమ్మని పంపించింది. ఆ విధంగానే శక్రుడు దానవులను గెలిచి తిరిగి స్వర్గంలోకి ప్రవేశించాడు. ఆ రక్ష ప్రభావం ఏడాదిపాటు ఉంటుందని, ఆపైన అతన్ని తాము గెలవవచ్చని శుక్రాచార్యుడు దుఃఖభీతులై ఉన్న దానవులను ఓదార్చాడు.
ఈ కథ విన్న యుధిష్టిరుడు ఆ రక్షను ఎలా కట్టుకోవాలని అడిగాడు. దానికి కృష్ణుడు “ధర్మరాజా! శ్రావణ పూర్ణిమనాడు ఉదయం ఉపాకర్మ, తర్చణాదులను నిర్వహించి మధ్యాహ్నం రక్ష ఉన్న పొట్లాన్ని పట్టు వస్త్రంలో కానీ, ఇతర వస్త్రాలతో కానీ సిద్ధం చేయాలి. ఇంటి మధ్య అలంకరించి పీఠం మీద రక్షను పెట్టి పూజించి పురోహితునితో కట్టించుకోవాలి.
“ఓ రక్షా బంధనమా! నీవు మహాబలి అయిన దానవేంద్రుణ్జి కట్టేశావు. కనుక నిన్ను నేను నా రక్ష కోసం కట్టుకుంటున్నాను” అని చెప్పుకుంటూ కట్టించుకోవాలి. దీన్ని అందరూ కట్టుకోవచ్చు. ఇట్లా రక్షను కట్టించుకునేవారు ఏడాది వరకు సుఖంగా ఉంటారు” అని చెప్పాడు.
నారికేళ పూర్ణిమ
మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో సముద్ర తీరవాసులు, శ్రావణ పూర్ణిమను విశేషంగా జరుపుకుంటారు. సముద్రాన్ని పూజించి కొబ్బరి కాయలను సమర్పిస్తారు. ఈ ప్రాంతాల్లోనివారు ఈ పండుగను “నారికేళ పూర్ణిమ, నార్లీ పూర్ణిమ” అని వ్యవహరిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రాఖీ పూర్ణిమ పురాణ కథలు
రాఖీ పూర్ణిమ పుట్టుక వెనుక బోలెడు పురాణకథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు రాఖీని అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు కట్టుకుంటున్నారు. కానీ మొదట ఈ రాఖీని ఓ భార్య భర్తకు కట్టిందని, ఓ దేవత రాక్షస రాజుకు కట్టిందని, ఓ రాణి తమ శత్రురాజుకు పంపిందని తెలుసా? వాళ్ళంతా మన పురాణ పాత్రలే.
వృత్తాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి విజయం కలగాలని కోరుతూ ఇంద్రుని భార్య ఇంద్రాణి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతని కుడిచేతి మణికట్టుకు కట్టింది. అలా రాఖీ పుట్టిందని చెపుతారు.
ఓసారి రాక్షసరాజైన బలిచక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడడానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలిచక్రవర్తి చేతికి పవిత్రదారాన్ని కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తను ఎలాగైనా తిరిగి వైకుంఠం పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మనుష్యులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతాడు.
ఓసారి శ్రీ కృష్ణుల వారి చేతికి గాయమైతే ద్రౌపది తన చీరను చించి ఆ చేతి నుంచి రక్తము కారకుండా కట్టు కట్టినది. ఆమెకు తన మీదగల ఆ సోదరప్రేమకు శ్రీ కృష్ణుడు కష్టకాలంలో ఆదుకుంటానని, ఆమెకు రక్షగా ఉంటానని మాట ఇచ్చాడు. శ్రీ కృష్ణుడు దాన్ని రక్షాబంధనముగా భావించాడని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.