వైశాఖ మాస విశిష్టత.. చలివేంద్రాలతో నీటి దానం చేస్తే పుణ్యం దక్కుతుంది
22 April 2023, 4:10 IST
- వైశాఖ మాస విశిష్టత, ఈ నెలలో చేయాల్సిన పూజలు, వ్రతాలు, దానాలను ఇక్కడ తెలుసుకోండి. వైశాఖ మాసం ఏప్రిల్ 21, 2023 నుంచి మే 21, 2023 వరకు ఉంటుంది.
కాళేశ్వరంలో కొలువై ఉన్న శివుడు.. వైశాఖ మాసంలో గళంతికతో శివుడికి అభిషేకం చేయాలని పెద్దల మాట
దక్షిణాయనంలో కార్తీకానికి, ఉత్తరాయణంలో మాఘ, వైశాఖ మాసాలకు ప్రత్యేక స్థానము ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వైశాఖమాసంలో గంగాస్నానం, విష్ణుమూర్తి ఆరాధన, నీటికుండ, గొడుగు వంటివి దానము చేయడం అత్యంత పుణ్యఫలమని వివరించారు.
లేటెస్ట్ ఫోటోలు
వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తీకము ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది.
సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు ఆచరించవచ్చు. అవి ఏమిటనగా వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది. విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది. అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు.
గళంతిక ఆరాధన శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నేలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.
వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం, బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో పుణ్య ఫలం దక్కుతుంది.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
టాపిక్