ఎల్లుండి నాగపంచమి.. ఎలా జరుపుకోవాలి?
19 August 2023, 9:27 IST
- నాగపంచమి ఈనెల 21 సోమవారం రోజున జరుపుకుంటారు. ఈ పండగ విశిష్టత, దీనిని ఎలా జరుపుకోవాలి వంటి విషయాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
నాగపంచమి కోసం విగ్రహాలను సిద్ధం చేస్తున్న శిల్పి
పార్వతీదేవికి నాగపంచమి గురించి స్వయంగా పరమేశ్వరుడు చెప్పినట్టుగా పురాణాలు వర్ణించాయి. ఓ పార్వతీదేవీ! శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనదని శివుడు ఉపదేశించినట్టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా నాగదేవత చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
లేటెస్ట్ ఫోటోలు
చతుర్ధి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం లేదా వెండి లేదా కర్ర లేదా మట్టితో వారివారి తాహతును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసువు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలను జాజి, సంపెంగ, గన్నేరు పూలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.
ఇదే విధంగా కార్తీకమాసంలో వచ్చే శుక్షపంచమినాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదే అని పండితుల ఉపదేశం. అందుచేత శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగ చతుర్ధి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.
గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజ గదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోను, పాలతోను అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసినవారిని నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాలనుంచి విముక్తి లభించడం, సర్పభయం తొలగిపోవడం వంటివి జరుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నాగపంచమి వ్రత కథ
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతి రోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వచ్చేవి. దాంతో ఆమె భయకంపితురాలైంది. ఒకరోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నాడు. విని “అమ్మా! నువ్వు గత జన్మలో పుట్టలో పాలుపోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువలన నీకు ఈజన్మలో ఈ జాఢ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోచుకోమని, పాముల భయం తొలగిపోతుందని చెబుతాడు. ఆమె అట్లాగే నోములు నోచి ఆ స్వప్నాల భయం నుంచి విముక్తురాలైంది. నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ ఆచారాన్ని పాటిస్తూ ఉంటే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసము వారిది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.