శ్రావణమాస ప్రాముఖ్యత.. ఏ రోజు ఎవరిని పూజించాలి?
07 August 2023, 11:37 IST
- శ్రావణమాస ప్రాముఖ్యత.. ఏ రోజు ఎవరిని పూజించాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
లక్ష్మీదేవి చిత్రం.. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసుకోండి
శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెలలో ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నది. విష్ణుమూర్తి శ్రవణానక్షత్రమున పుట్టినవారు. ఈ నెలలో జన్మించినవారు వేదోక్తకర్మలు నిర్వహించడము, సకల జనుల మన్ననలను పొందడము, సిరిసంపదలు సమృద్ధితో జీవనము సాగించగలరని నమ్మకము.
లేటెస్ట్ ఫోటోలు
ఈ నెలలో జన్మించిన మహానుభావులు శీకృష్ణపరమాత్మ, హయగ్రీవుడు. మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసములో లక్షీవారాలు ఇలా ఒక్కొక్క మాసములో ఒక్కో రోజు పవిత్రదినముగా భావిస్తారు. అయితే శ్రావణమాసములో అన్ని రోజులూ పవిత్రమైనవే. ప్రతి దినము ముఖ్యమైనదే. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
* సోమవారాల్లో శివుడికి అభిషేకాలు
* మంగళవారం గౌరీ వ్రతం
* బుధవారం విఠలుడికి పూజలు
* గురువారాల్లో గురుదేవుడికి ఆరాధన
* శుక్రవారాల్లో లక్ష్మి తులసి పూజలు
* శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి పూజలు
భక్తులు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజించడం తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. రోజూ చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రైకాదశి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషిపంచమి, గోవత్స బహుళ, సీతల సప్తమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
పరమశివుడి వారం
సోమవారం భక్తులు హరహరమహాదేవ శంభో శంకర అంటూ పిలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం, దక్షిణ సమర్పించి భక్తులు శివుడికి హారతి ఇస్తారు.
బిల్వపత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పువ్వులతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.