Puri Rath Yatra Special Trains :పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు అలర్ట్-సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు
17 June 2023, 21:46 IST
- Puri Rath Yatra Special Trains :పూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 18 నుంచి 29 మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
Puri Rath Yatra Special Trains : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. జూన్ 18 నుంచి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుంచి స్టార్ట్ అవుతాయని వెల్లడించింది. టికెట్ల రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు. ఒడిశా పూరిలో ఈ నెల 20 నుంచి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు ఈ నెల 18, 19, 20, 21, 22 తేదీలలో నడుస్తాయని వెల్లడించింది. సికింద్రాబాద్-మలాటిపట్పూర్, నాందేడ్- కుర్దారోడ్, కాచిగూడ, మలాటిపట్పూర్ స్టేషన్ల మధ్యలో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. ఈ నెల 18న సికింద్రాబాద్ నుంచి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్ కు, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందెడ్ కు, ఈ నెల 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు
పూరీ యాత్రకులు కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. 08901 విశాఖపట్నం-పూరీ స్పెషల్ జూన్ 19, 27 తేదీలలో మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరనుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు తెల్లవారుజామున 01.15 గంటలకు పూరీకి చేరుకోనుంది. 08902 పూరీ - విశాఖపట్నం ట్రైన్ జూన్ 20, 28 తేదీలలో రాత్రి 10.55 గంటలకు పూరీ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 08057 జగదల్పూర్-పూరీ స్పెషల్ ట్రైన్ జూన్ 19, 28 తేదీలలో ఉదయం 10 గంటలకు జగదల్పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.00 గంటలకు పూరీకి చేరనుంది. 08058 పూరీ-జగదల్పూర్ రైలు జూన్ 20, 29 తేదీలలో రాత్రి 9.30 గంటలకు పూరీ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు జగదల్పూర్ చేరనుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను యాత్రికులు వినియోగించుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు కోరారు.
పది రైళ్లు రద్దు
పలు స్టేషన్ల పరిధిలో పది రైళ్లను రద్దు చేశారు. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటిలో షాలీమార్-హైదరాబాద్, సత్రగాచి-తిరుపతి, గౌహతి-సికింద్రాబాద్, హౌరా-పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్- సత్రగాచి, మైసూర్-హౌరా, సికింద్రాబాద్-ఆగ్రాతో పాటు ఎర్నాకులం-హౌరా మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.