Gyanvapi Shivling | 'జ్ఞాన్వాపి మసీదులో శివలింగం కనిపించింది'
16 May 2022, 16:37 IST
Gyanvapi Shivling | జ్ఞాన్వాపి మసీదులో శివలింగం కనిపించిందని హిందూ న్యాయవాదులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని మూసివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
జ్ఞాన్వాపి మసీదు
Gyanvapi Shivling | ఉత్తర్ప్రదేశ్ వారణాసి జ్ఞాన్వాపి మసీదు వీడియో సర్వేలో చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మసీదులోని ఓ చెరువులో శివలింగం కనిపించిందని పలువురు న్యాయవాదులు వెల్లడించారు. శివలింగం రక్షణ కోసం వారు సివిల్ కోర్టుకు వెళ్లారు. ఇది జరిగిన కొద్దిసేపటికే.. ఓ కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
చెరువులో శివలింగం..!
వీడియో సర్వేలో భాగంగా.. సోమవారం ఉదయం మసీదులో ఉన్న చెరువులోని నీటిని తొలగించారు. ఈ క్రమంలోనే చెరువు లోపల శివలింగం కనిపించిందని న్యాయవాదులు విష్ణు జైన్, సుభాష్ నందన్ చతుర్వేదిలు మీడియాకు వెల్లడించారు.
Shivling found in Gyanvapi | శివలింగాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో వారణాసి జిల్లా మెజిస్ట్రేట్కు.. కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చెరువును మూసివేయాలని, ఎవరు అటువైపు వెళ్లకూడదని స్పష్టం చేసింది. మూసివేసిన ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యతను సీఆర్పీఎఫ్, పోలీసు చీఫ్కు అప్పగించాలని మెజిస్ట్రేట్కు సూచించింది.
కాగా.. మసీదులో శివలింగం కనిపించిందన్న వార్తలను వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ ధ్రువీకరించలేదు.
'అవాస్తవం..'
Shivling in Gyanvapi | శివలింగం కనిపించిందన్న వార్తలను మసీదు కమిటీకి చెందిన న్యాయవాది అంజుమ్ ఖండించారు. పిటిషనర్లు.. తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చెరువులో ఉన్నది శివలింగం కాదని.. అది ఓ ఫౌంటైన్ అని అన్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని వెల్లడించారు.
ఇదీ వివాదం..
వారణాసిలోని కాశీవిశ్వణాధుడి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ జ్ఞాన్వాపి మసీదు. దాని వెనుక కొన్ని హిందూ దేవతల విగ్రహాలు ఉంటాయి. ప్రస్తుతం.. ఆ ప్రాంతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయి.
Gyanvapi mosque Shivling | ఈ విషయంపై ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏడాది పొడవునా.. ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో.. మసీదు కాంప్లెక్స్, నేలమాళిగలు, చెరువు వంటి ప్రాంతాల్లో వీడియో సర్వే నిర్వహించాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది.
Gyanvapi survey | కోర్టు ఆదేశాల మేరకు అధికారులు.. ఈ నెల 6న సర్వే చేపట్టారు. కానీ ఉద్రిక్తతల నేపథ్యంలో సర్వే ఆగిపోయింది. అనంతరం తాజాగా సర్వేను మంగళవారం పూర్తిచేశారు.
సర్వేకు వ్యతిరేకంగా సూప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం.